కొండా సురేఖ కోపం చల్లాబడింది
posted on May 14, 2013 2:51PM
మొత్తం మీద కొండా సురేఖ దంపతుల కధకి ఈ రోజు శుభం కార్డు పడింది. నిన్నపార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను కలిసిన తరువాత వారిరువురూ నేడు చంచల్ గూడ జైలుకు వెళ్లి ములాఖత్ సమయంలో జగన్ మోహన్ రెడ్డిని కలిసి మాట్లాడిన తరువాత ఇద్దరూ ప్రసన్నంగానే కనిపించారు. తరువాత వారు మీడియాతో మాట్లాడుతూ తాము వైయస్సార్ కుటుంబము వెంటే ఉంటామని, తమ మధ్య తలెత్తిన చిన్నపాటి మనస్పర్ధలను తాము ఈ సమావేశంలో తొలగించుకొన్నామని, అయితే వాటిని మీడియా గోరంతలను కొండతలుగా చేసి చూపడం వలననే సమస్య పెద్దదిగా కనిపించిందని అన్నారు. తమకి పార్టీ వీడే ఆలోచన ఏమి లేదని, పార్టీ మారుతున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలనీ నిజం కాదని వారన్నారు.
దీనిని బట్టి కొండా అనుచరులు నలుగురిని తిరిగి పార్టీలోకి తీసుకోవడానికి, వారు సూచించిన ఇతర విషయాలను, సలహాలను పాటించడానికి జగన్ మోహన్ రెడ్డి అంగీకరించినట్లుగా అర్ధం అవుతోంది. ఇప్పుడు ఆయన దాడి వీరభద్ర రావు విషయంలోతన పార్టీకి చెందిన నేత కొణతాల రామకృష్ణ వెలిబుస్తున్నఅభ్యంతరాలను పరిష్కరించవలసి ఉంది.