కూటమి ఏర్పాటు ఆలస్యమైతే అన్ని పార్టీలకు నష్టం

 

తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్,టీడీపీ,టీజేఎస్,సీపీఐ పార్టీలు మహాకూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే.అయితే కూటమిలో పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో సమన్వయం కుదరట్లేదు.ఈ నేపథ్యంలో టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం కొంత అసంతృప్తితో ఉన్నారు.దీనిపై మాట్లాడేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పిలుపు మేరకు కోదండరాం ఢిల్లీ వెళ్లారు.రాహుల్ తో భేటీ అయ్యారు.భేటీ అనంతరం కోదండరాం మాట్లాడుతూ..కూటమి ఏర్పాటుపై రాహుల్‌గాంధీతో చర్చించానని, ఉమ్మడి కార్యాచరణ వేగవంతం చేయాలని ఆయన్ను కోరినట్లు చెప్పారు. కలిసి వచ్చే శక్తులతో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాహుల్‌ తెలిపారన్నారు. కూటమి ఏర్పాటు ఆలస్యమైతే అన్ని పార్టీలకు నష్టం జరిగే అవకాశముందని, ఇదే విషయాన్ని ఆయన దృష్టి తీసుకెళ్లినట్లు కోదండరాం చెప్పారు. కూటమి ఏర్పాటు, సీట్ల సర్దుబాటుపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకులకు రాహుల్‌ సూచించారని కోదండరాం వివరించారు.

సీట్ల గురించి కూటమిలోని పార్టీల మధ్య చర్చలు పూర్తి కావడం లేదని కోదండరాం చెప్పారు. తాము 17 సీట్లు కోరామని.. 15 స్థానాల్లో పోటీ చేయగలమనే ఆలోచనతో ఉన్నట్లు వివరించారు. కూటమి ఏర్పాటు, సీట్ల పంపకాలు వేర్వేరు అంశాలని ఆయన అభిప్రాయపడ్డారు. అధికారం కోసం కూటమిగా ఏర్పడితే ప్రయోజనం ఉండదని, లక్ష్య సాధనకోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు.పార్టీ నిర్మాణం లేకుండా సీట్లు అడగటం లేదని, పార్టీ పరిస్థితి బాగున్న స్థానాలు కోరుతున్నట్లు కోడండరాం చెప్పారు. సుమారు 25 చోట్ల తెజస బలంగా ఉందని ఆయన తెలిపారు. కూటమి ఏర్పాటు ఆవశ్యకతను బలంగా ప్రజలకు వివరించాలని భావిస్తున్నామన్నారు.ఎన్నికల్లో ఏ స్థానం నుంచి పోటీలో ఉంటారని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ ఆ విషయం అప్రస్తుతమని వ్యాఖ్యానించారు. తన పోటీ విషయంపై హైదరాబాద్‌ చేరుకున్నాక చెప్తానన్నారు. కూటమిలోని సీట్ల సర్దుబాటుపై తేలితే మిగతా విషయాలన్నీ నిర్ణయిస్తామన్నారు. సీట్ల కేటాయింపుపై టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి చేసిన 95, 24 స్థానాల ప్రకటనపై తనకు తెలియదని వ్యాఖ్యానించారు. చర్చలు పరిష్కారం కాకపోతే తమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.