దేనికీ పనికిరాని సన్నాసులు అంటూ టీడీపీ నేతలపై ఫైర్ అయిన మంత్రి కొడాలి నాని 

ఏపీ పౌరసరఫరాల శాఖా మంత్రి కొడాలి నాని హిందూ దేవాలయాలు, ఆస్తుల పైన జరుగుతున్న దాడుల పైనా.. తరువాత తిరుమలలో సీఎం డిక్లరేషన్ పైన చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో పెను ప్రకంపనలు పుట్టించిన సంగతి తెల్సిందే. అయన చేసిన వ్యాఖ్యలతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున బీజేపీ నేతలు నిరసనలు తెలియజేయడమే కాకుండా.. అయన పై పలు చోట్ల కేసులు కూడా పెట్టారు. అంతేకాకుండా మంత్రి నాని చేసిన వ్యాఖ్యలను సొంత పార్టీలోని నేతలు కూడా తప్పు పట్టారు. ఈ మాటల మంటలు చల్లారకే ముందే మరోసారి మీడియా ముందుకొచ్చిన మంత్రి నాని టీడీపీ నేతలపై తీవ్ర దుమారం రేపే వ్యాఖ్యలు చేశారు.

 

"టీడీపీ సన్నాసులకు చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టులు చదవడం తప్ప లోకజ్ఞానం తెలియదని" కొడాలి నాని వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలే దళితులపై దాడులు చేయించి.. జగన్‌ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని మంత్రి తాజాగా ఆరోపించారు. "దేనికీ పనికిరాని కొందరు టీడీపీ నేతలు టీవీల ముందుకు వచ్చి విషపూరిత ఉపన్యాసాలు ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. దళితులకు ద్రోహం జరుగుతోందంటూ టీవీ చానళ్లు చర్చా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాయని, వాస్తవానికి టీడీపీ నేతలే దళితులపై దాడులు చేయిస్తున్నారని అయన ఆరోపించారు. ఓవైపు దళితులపై దాడులు చేయిస్తూ, ప్రభుత్వంపై బురద చల్లాలని ప్రయత్నిస్తున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు.