చంద్రబాబుని తరిమికొట్టాల్సిన బాధ్యత మీదే

 

కాంగ్రెస్, టీడీపీ మహాకూటమితో దగ్గర అయినప్పటి నుంచి చంద్రబాబుని టార్గెట్ చేస్తూ కేసీఆర్ విమర్శలు గుప్పిస్తున్నారు. జడ్చర్లలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్ మరోసారి చంద్రబాబు మీద విమర్శల దాడి చేశారు. కేసీఆర్‌ మాట్లాడుతూ.. ‘తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలమూరు వలసలు తగ్గాయి. ఇతర ప్రాంతాలకు వెళ్లిన వాళ్లు కూడా తిరిగి జిల్లాకు వస్తున్నారు. తెలంగాణ కల సాధించుకున్నాం. ఇప్పుడు కోటి ఎకరాల తెలంగాణ పచ్చగా చేయాలన్న కలను సాకారం చేసుకుందాం. రాష్ట్రం రానే రాదని అందరూ హేళన చేశారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఏకతాటిపై నిలిచి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. పెండింగ్‌ ప్రాజెక్టుల పనులు పూర్తి చేసుకున్నాం. ప్రాజెక్టుల పనులు చేపట్టి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేశాం’ అన్నారు. చంద్రబాబు ఈ జిల్లాలో కొందరిని పోటీకి పెట్టారు. ఆయన పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి ‘వదల బొమ్మాళి.. వదలా’ అంటూ రాష్ట్రంలోకి మళ్లీ వస్తున్నారు. గతంలో నా వంతు నేను ఒకసారి తరిమి కొట్టా. ఇప్పుడు ఆయన్ను తరిమికొట్టాల్సిన బాధ్యత మీదే. పాలమూరు జిల్లాను తొమ్మిది సంవత్సరాలు చంద్రబాబు దత్తత తీసుకున్నారు. ఆయన ఏం చేశారు?. కానీ, ఇప్పుడు అన్ని పనులు వరుసగా జరుగుతున్నాయి. పాలమూరు ఎత్తిపోతల పనులు కూడా చకచకా జరిగిపోతున్నాయి. మహాకూటమి పేరుతో మళ్లీ చంద్రబాబు మన ఇంట్లో దూరి ‘మిమ్మల్ని కొట్టి పోతా’ అంటున్నారు. రానీద్దామా?.. కాంగ్రెస్‌ వాళ్లు చంద్రబాబును మోసుకొస్తున్నారు' అని కేసీఆర్ ధ్వజమెత్తారు.