రేవంత్ రెడ్డిపై కుట్ర.. రెండు రోజుల్లో అరెస్ట్.!!

 

తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి.. తనను జైలుకు పంపేందుకు కేసీఆర్‌, మోదీ కుట్ర చేస్తున్నారని, రెండు మూడు రోజుల్లో తనను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేసారు.. తాజాగా గాంధీభవన్‌లో రేవంత్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ కమిటీల్లో తనకు పదవి ఇస్తే రాష్ట్రమంతా తిరిగి తెరాసను ఎండగడుతానని, ఆ పార్టీ ఓటమికి కారణమవుతాననే భయం కేసీఆర్‌ను వణికిస్తోందన్నారు.. పదవి రాకముందే పాత కేసులను తిరగదోడి తనను, చంద్రబాబును జైల్లో పెట్టాలని మోదీతో కలిసి కేసీఆర్‌ కుట్ర చేశారన్నారు.. బాబ్లీ కేసులో చంద్రబాబుకు అరెస్ట్ వారెంట్‌ జారీ చేయడం కుట్రలో భాగమేనన్నారు.. ఓటుకు నోటు కేసులో తన ఇంటిపై ఈడీ, ఐటీ విభాగాలతో దాడులు చేయించి అరెస్టు చేయాలని పథకం రచించారని.. ఈనెల 12న తన, బంధువుల ఇళ్లపై కూడా దాడులకు సిద్ధపడి చివరి క్షణంలో వెనక్కి తగ్గారన్నారు.. ఒక కేసులో అరెస్టయి బెయిల్‌పై వచ్చిన వారిని తిరిగి అదే కేసులో మరోసారి అరెస్టు చేయడం చట్టవిరుద్ధమని కొందరు అధికారులు చేసిన సూచన మేరకు పునరాలోచనలో పడ్డారన్నారు.. ఎన్నికల వేళ పార్టీశ్రేణులు అప్రమత్తంగా ఉండాలని, క్రియాశీలకంగా వ్యవహరించే రాజకీయ నాయకులు, పౌరులపై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారని అన్నారు.. తెలంగాణ సమాజం కేసీఆర్‌ నిరంకుశ పాలనను, చట్ట వ్యతిరేక విధానాలను గమనించాలని రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.