కేసీఆర్ సర్కార్... సామాన్యుడి బాధలపై స్పందించండి!

లాక్ డౌన్ కారణంగా డయాలసిస్ కు వెళ్లలేని ఒక సామాన్యుడి కథ ఇది. ఉస్మానియా యూనివర్సిటీ ఔట్ గేట్ దగ్గర అరటి పండ్లు అమ్ముకునే ఒక చిరు వ్యాపారి అయిన 55 ఏళ్ల మొహమ్మద్ వాజిద్ కిడ్నీ పేషంట్. వారం వారం డయాలసిస్ కు వెళ్లాల్సి ఉంటుంది. అది కూడా మహావీర్ హాస్పిటల్ కు. ఓ యూ ఔట్ గేట్ నుంచి ఏ సి గార్డ్స్ లో ఉన్న మహావీర్ హాస్పిటల్ కు వెళ్లాలంటే, ఈ లాక్ డౌన్ పీరియడ్ లో వాజీద్ లాంటి వారికి సాధ్యమయ్యే పని కాదు. అయితే, తెలంగాణా ప్రభుత్వం ట్విట్టర్ లో చేస్తున్న హడావుడి, ఇలాంటి బడుగు జీవుల విషయం లో మాత్రం కనపడటం లేదనేది వాస్తవం. 21 రోజుల లాక్ డౌన్ దేశంలో ప్రజా జీవితాన్ని పూర్తిగా స్థంభింపచేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు తాజాగా కొన్ని ఆదేశాలను జారీ చేసింది. లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో తాజా ఆదేశాల అమలు అత్యంత అనివార్యమని కేంద్రం స్పష్టం చేసింది. గతంలో కనీ వినీ ఎరుగని రీతిలో దేశంలో 21 రోజుల లాక్ డౌన్ విధించారు. ఇది ఎమర్జెన్సీ పరిస్థితి కంటే తీవ్రంగా ప్రజలను ఇబ్బంది పెడుతోంది. అయితే.. ప్రాణాంతకమైన కరోనా వ్యాప్తిని నిరోధించాలంటే ఇంత కంటే వేరే మార్గం లేదని ప్రతీ ఒక్కరు అంగీకరించాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో కేంద్రం రాష్ట్రాలకు చేసిన సూచనలు అత్యంత కీలకంగా మారాయి.

ప్రభుత్వాల పిలుపులో తీవ్రతను ప్రజలు అర్థం చేసుకున్నా.. పేద, దిగువ మధ్య తరగతి ప్రజలకు ఈ లాక్ డౌన్ అత్యంత దారుణమైన పరిస్థితులను సృష్టించింది. ముఖ్యంగా ఉపాధి కోసం దేశంలో ఎక్కడి నుంచి మరెక్కడికో వలస వెళ్ళి దినసరి కూలీ మీద జీవితాలను వెల్లదీస్తున్న వారికి లాక్ డౌన్ తినడానికి తిండి లేకుండా చేసింది. నిలువ నీడ లేకుండా చేసింది. దాంతో ఎలాగైనా తమ స్వస్థలాలకు చేరుకునేందుకు రకరకాల మార్గాలను ఆశ్రయిస్తున్నారు వలస కార్మికులు, వలస జీవులు. కొందరైతే వందల కిలోమీటర్లు కాలినడకన తమ సొంత ప్రాంతాలకు తరలి వెళుతున్నారు. మరికొందరు అక్రమ మార్గాల్లో సొంత ప్రాంతాలకు చేరేందుకు ట్రై చేస్తున్నారు. ఇందులో భాగమే.. తాజాగా మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి గూడ్స్ వెహికిల్ వచ్చేందుకు విఫలయత్నం చేసినవారే ఉదాహరణ. ఇలాంటి వారికోసమే తాజాగా కేంద్రం అన్ని రాష్ట్రాలకు నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి తమతమ రాష్ట్రాలలో వలస కార్మికులుగా జీవనం వెల్లదీస్తున్న వారికి అక్కడే ఏదో రకంగా షెల్టర్ కల్పించాలన్నది కేంద్రం తాజాగా ఇచ్చిన ఆదేశాల సారాంశం. వలస జీవులకు తాత్కాలిక షెల్టర్లు నిర్మించి ఆశ్రయం కల్పించాలని, కేంద్రం ఇస్తున్న బియ్యం, గోధుమలు, పప్పు ధాన్యాలను వారికి చేరేలా చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ దేశంలోని 18 మంది ముఖ్యమంత్రులకు లేఖ రాస్తూ.. వారి వారి రాష్ట్రాలలో వున్న బెంగాలీలకు ఆశ్రయం, ఆహార సౌకర్యాలు కల్పించాలని కోరారు. అదే విధంగా తెలంగాణలో వున్న ఆంధ్రా కార్మికులకు, విద్యార్థులకు, తాత్కాలిక ఉద్యోగులకు ఆశ్రయం కల్పించాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్.. కేసీఆర్‌ను కోరారు. ఈ క్రమంలో కేంద్రం వలస జీవుల కష్టాలపై స్పందిస్తూ… వారికి ఆశ్రయ, ఆహార సౌకర్యాలు కల్పించాలని రాష్ట్రాలకు సూచించింది. ఇదే క్రమం లో దీర్ఘ కాలిక రోగాలకు చికిత్స పొందే దిగువ మధ్య తరగతి, అల్పాదాయ వర్గాల వారికి ప్రత్యామ్నాయ రవాణా  సౌకర్యం,తక్షణ వైద్య సౌకర్యం అందే ఏర్పాటు చేయాలనేది ప్రస్తుతం వినిపిస్తున్న డిమాండ్.