కేసీఆర్, పొన్నాలకు విద్యార్థుల షాక్‌!

 

తెలంగాణ ఉద్యమం పేరుతో హడావిడి చేస్తున్న రాజకీయ నాయకులకు కరెక్ట్ మొగుళ్ళు ఎవరయ్యా అంటే.. ఇంకెవరూ.. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు. వాళ్ళ మధ్యలోకి వెళ్తే ఎంత పుడింగి లాంటి రాజకీయ నాయకుడైనా భంగపడాల్సిందే. ఇలా గతంలో అనేకమంది నాయకులు భంగపడ్డారు. పేర్లెందుకు గానీ, కొంతమంది నాయకులైతే పాపం ఉస్మానియా విద్యార్థుల చేతుల్లో తన్నులు కూడా తిన్నారు. అప్పుడెప్పుడో కేసీఆర్ ఉత్తుత్తి నిరాహారదీక్ష చేసి పళ్ళరసం తాగి విరమించగానే ఉస్మానియా విద్యార్థులు రంగంలోకి దిగారు. దాంతో భయపడిపోయిన కేసీఆర్‌ చచ్చినట్టు ఫ్లూయిడ్స్ ఎక్కించుకుని మరీ వెరైటీ నిరాహారదీక్ష చేశాడు. అలాంటి ఉస్మానియా విద్యార్థులు కేసీఆర్‌కి మరోసారి షాక్ ఇచ్చారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిసరాల్లో ప్రచారం చేయడానికి హెలికాప్టర్లో వెళ్ళాడు. హెలికాప్టర్ ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో దిగగానే విద్యార్థులు కేసీఆర్‌కి చెప్పులు చూపిస్తూ ‘గో బ్యాక్’ అని అరిచారు. తెలంగాణ విద్యార్థులకు నష్టం కలిగేలా వ్యవహరిస్తున్న కేసీఆర్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాంతో బెదిరిపోయిన కేసీఆర్ అక్కడి నుంచి హెలికాప్టర్ ఎక్కి తుర్రుమని పారిపోయే వరకూ విద్యార్థులు వెనకడుగు వేయలేదు. అలాగే టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకి కూడా ఒక తెలంగాణ విద్యార్థి షాకిచ్చాడు. సొంత నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్న పొన్నాల మీద ఒక విద్యార్థి చెప్పు విసరడానికి ప్రయత్నించాడు. అది గమనించిన కాంగ్రెస్ కార్యకర్తలు ఆ విద్యార్థిని పట్టుకుని చావబాదారు. తనకు చెప్పుతో స్వాగతం లభించడంతో బిత్తరపోయిన పొన్నాల అక్కడ ప్రచారం చేయకుండానే వెళ్ళిపోయాడు. మొత్తమ్మీద ఏంటంటే, కేసీఆర్, పొన్నాల.. వీళ్ళిద్దరూ ఒకరికొకరు భయపడరు. కానీ ఇద్దరూ స్టూడెంట్స్ అంటే భయపడతారు.