కేసీఆర్ మీడియా లీకులతో ప్రత్యర్ధులు తికమక

 

తెరాస అభ్యర్ధుల మొదటి జాబితా ఇంకా విడుదల కానేలేదు. కానీ, కేసీఆర్ మల్కాజ్ గిరీ నుండి, కేటీఆర్ సిరిసిల్లా నుండి, కవిత నిజామాబాద్ నుండి మరొకరు మరొక చోటు నుండి పోటీ చేస్తారంటూ తెరాస మీడియాకి లీకులు ఇస్తూ తమ ప్రత్యర్దులను తికమక పరిచే ప్రయత్నం చేస్తోంది. ఊహించినట్లే కేసీఆర్ విసిరినా గేలానికి కొన్ని చేపలు చిక్కుకొని విలవిలలాడుతున్నాయి. వాటిలో మొదటి చేప తెదేపా తెలంగాణా ఎన్నికల కమిటీ కన్వీనర్ మోత్కుపల్లి నర్సింహులు. ప్రస్తుతం తెదేపాలో మల్కాజ్ గిరీ నుండి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న వారు చాలా మందే ఉన్నారు. వారిలో మోత్కుపల్లి కూడా ఒకరు.

 

ఇప్పుడు కేసీఆర్ అక్కడి నుండి పోటీ చేస్తారని మీడియా గుప్పుమనడంతో, ఇదే అదునుగా “పార్టీ అదేశిస్తే తాను కేసీఆర్ పై పోటీ చేసి ఓడిస్తానని” ప్రకటించేసారు. అయితే కేసీఆర్ అక్కడి నుండి పోటీ చేస్తారనే నమ్మకం ఏమీ లేకపోయినా, ఈ సాకుతో మోత్కుపల్లి కూడా మల్కాజ్ గిరీపై కన్నేయడాన్ని అక్కడి నుండి పోటీ చేయాలను కొంటున్న రేవంత్ రెడ్డి వంటి వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక చిన్న మీడియా లీకుతో తెలుగు తమ్ముళ్ళ మధ్య చిచ్చుపెట్టగలిగిన కేసీఆర్ ని, నిజంగానే మోత్కుపల్లి డ్డీకొని ఓడించగలరా? అంటే అనుమానమే. కానీ, ఈ సాకుతో తాను కూడా మల్కాజ్ గిరీ నుండి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు మోత్కుపల్లి విస్పష్టంగా ప్రకటించగలిగారు.