కాంగ్రెస్ లో రచ్చ.. ఎమ్మెల్యే తల పగులగొట్టిన మరో ఎమ్మెల్యే!!

 

కర్ణాటకలో మళ్లీ రిసార్ట్‌ రాజకీయాలు మొదలైన విషయం తెలిసిందే. బీజేపీ తమ ఎమ్మెల్యేలను ప్రలోభ పెడుతుందనే భయంతో పాటు.. సీఎల్పీ భేటీకి నలుగురు ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడంతో కాంగ్రెస్‌ తమ పార్టీ ఎమ్మెల్యేలను ఈగల్టన్‌ రిసార్ట్స్‌కు తరలించింది. అయితే, ఆ రిసార్టులో నిన్న సాయంత్రం కొందరు ఎమ్మెల్యేలు ఘర్షణకు దిగినట్లు తెలుస్తోంది. కర్ణాటక కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆనంద్‌ సింగ్‌, జేఎన్‌ గణేష్‌ల మధ్య వాగ్వాదం జరగ్గా సింగ్‌ తలపై గణేష్‌ బాటిల్‌ విసిరికొట్టారని సమాచారం. గాయపడిన ఆనంద్‌ సింగ్‌ను ఆస్పత్రికి తరలించారని స్ధానిక మీడియా వెల్లడించింది. ఈ విషయంపై కొందరు కాంగ్రెస్‌ నేతలను ప్రశ్నించగా.. వారు ఈ ఆరోపణలను కొట్టేస్తున్నారు. ఆనంద్‌ సింగ్‌ను ఛాతీ నొప్పి రావడంతోనే ఆస్పత్రిలో చేర్పించినట్టు కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి.

మరోవైపు ఈ ఘటనపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ‘కాంగ్రెస్‌ పార్టీలో పరిస్థితులు దిగజారిపోయాయని చెప్పడానికి ఇంతకన్నా రుజువు ఇంకేం కావాలి? ఆ పార్టీ నేతలు ఈగల్టన్‌ రిసార్ట్‌లో ఘర్షణ పడ్డారు. వారిలో ఒకరు ఆస్పత్రిలో పాలయ్యారు. తమలో ఉన్న అంతర్గత విభేదాలను కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్‌ పార్టీ ఇంకెంత కాలం బీజేపీపై ఆరోపణలు చేస్తుంది?’ అని ఆ పార్టీ తమ అధికారిక ట్విటర్‌ ఖాతాలో విమర్శలు గుప్పించింది. అయితే ఈ వార్తలపై స్పందించిన కాంగ్రెస్ నేత డీకే శివకుమార్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇది అసత్య వార్త. మా పార్టీ నేతలు ఐకమత్యంతో, కలిసిమెలసి ఉన్నారు’ అని అన్నారు.