డబ్బులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే... మనిషి 3 లక్షలు

 

నల్లధనాన్ని అరికట్టేందుకు గాను ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో సామాన్యం జనం పాత నోట్లను మార్చుకోవడానికి బ్యాంకుల చుట్టూ తిరుగుతుంటే.. ఇక నల్లధనం దాచుకున్న బడా బాబాలు మాత్రం బెంబేలెత్తిపోతున్నారు. అయితే ఈ టైంలో ఓ ఫొటో మాత్రం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. అదేంటంటే... ఓ ఎమ్మెల్యే పేదలకు డబ్బులు పంపిణీ చేస్తున్న ఫొటో. అసలు సంగతేంటంటే.. కర్ణాటకలోని కోలార్ ప్రాంతంలో బంగార్‌పేట ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకుడు ఎస్‌ఎన్ నారాయణ స్వామి పేదలకు తలా మూడు లక్షల రూపాయలు పంచిపెట్టారు.  ఆయన పంపిణీ చేసినవన్నీ రూ.500, రూ.1000 నోట్లే. ఆయన టేబుల్ మీద డబ్బు కట్టలు పెట్టి జనానికి పంచుతున్న ఫొటో సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా షేర్ అయింది. దీంతో ఈ ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు కూడా వినిపించాయి. ఇక ఈ వార్త పోలీసుల వరకూ చేరడంతో దీనిపై విచారణ జరిపారు. అయితే ఈ విచారణలో తేలిన నిజం ఏంటంటే.. ఎమ్మెల్యే డబ్బు పంచి పెట్టింది సోమవారంనాడని.. ప్రధాని మోదీ పెద్ద నోట్లను రద్దు చేయడానికి ఒకరోజు ముందే ఈ డబ్బు పంపిణీ జరిగిందని చెప్పారు. మరి నిజంగానే ఎమ్మెల్యే మంచి ఉద్దేశ్యంతోనే డబ్బు పంచారా..? లేక ముందుగానే ఏమన్న సమాచారం అందిందా..? ఏమో ఆయనకే తెలియాలి.