కర్ణాటకలో ముఖ్యమంత్రి రేసులో పోటీ మొదలు
posted on May 8, 2013 12:44PM
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారం కైవసం చేసుకోబోతోందని స్పష్టమవుతున్న తరుణంలో మళ్ళీ చాలా ఏళ్ళ తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ మార్క్ రాజకీయాలు జోరందుకొన్నాయి. ముఖ్యమంత్రి పదవికి పోటీలోనలుగురు బలమయిన అభ్యర్ధులు-మాజీ ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, మల్లికార్జున ఖార్గే, కేంద్ర మంత్రి ఎస్.ఎం.కృష్ణ,, మరియు కర్నాటక పిసిసి అధ్యక్షుడు పరమేశ్ అప్పుడే తమ ప్రయత్నాలు ఉదృతం చేసారు. పార్టీలో వీలయినంత ఎక్కువమందిని తమ వైపుకు తిప్పుకొనే ప్రయత్నంలో వ్యక్తిగతంగా, ముఠాలవారిగా సమావేశాలవుతు తమకే మద్దతు ఇవ్వాలని అందరినీ బ్రతిమాలుకొంటున్నారు. అందుకు ప్రతిఫలంగా అధికారంలోకి రాగానే వారికి యధోచిత పదవులు, ఇతర వ్యవహారాలలో సహకారం అందిస్తామని హామీలు ఇస్తున్నారు.
ఈ రోజు సాయంత్రంకల్లా ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడుతాయి గనుక, ఒకటి రెండు రోజుల్లోనే ఎన్నికయిన శాసన సభ్యులను సమావేశ పరచి ముఖ్యమంత్రి పేరు ప్రకటిస్తారు. గనుక, ముందుగానే నలుగురు ప్రధాన అభ్యర్ధులు బలం కూడగట్టుకొంటున్నారు. ఇక ఈ తంతు ముగియగానే ఇక మంత్రి వర్గంలో పదవుల కోసం కొత్త పోటీ మొదలవుతుంది. దాని తరువాత షరా మామూలుగానే పదవులు దక్కని వారి అలకలు, అసమ్మతి ఎపిసోడ్ ఒకటి ఉంటుంది. ఆ తరువాత నుండి కర్ణాటకలో కూడా కాంగ్రెస్ మార్క్ పరిపాలన మొదలవుతుంది.