చంద్రబాబు ఊసరవెల్లిని మించిపోయారు

 

కాంగ్రెస్, టీడీపీ దోస్తీ గురించి ఇతర పార్టీ నేతలు చంద్రబాబు మీద విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మీడియా సమావేశంలో.. గతంలో ఎన్టీఆర్ తనకు చంద్రబాబు ద్రోహం చేశారంటూ వ్యాఖ్యానించిన వీడియోలను ప్రదర్శించారు. అంతేగాక, చంద్రబాబు గతంలో కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని, సోనియా గాంధీని విమర్శించిన వీడియోలను కూడా చూపించారు. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ చంద్రబాబు మీద విమర్శలు గుప్పించారు.

ఇప్పటి వరకు అన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకున్న చంద్రబాబు చివరకు కాంగ్రెస్ పార్టీతో కూడా పొత్తు పెట్టుకుని ఊసరవెల్లిని మించిపోయారని విమర్శించారు. స్టాచూ ఆఫ్ యూనిటీకి సర్దార్ పటేల్ నిదర్శనమైతే.. స్టాచూ ఆఫ్ ఆపర్చునిటీ, అవినీతికి నిదర్శనం చంద్రబాబేనని అన్నారు. చంద్రబాబుకు రోజుకో మాట మాట్లాడటం అలవాటని విమర్శించారు. ఆయన అపరిచితుడని, మానసిక వ్యాధితో బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో దోచేసిన సొమ్మును లాక్కుంటారని భయంతోనే చంద్రబాబు దేశం మొత్తం తిరుగుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీతో టీడీపీ కలిస్తే ఉరివేసుకుంటానని ఓ మంత్రి, ప్రజలు బట్టలూడదీసి కొడతారని మరో మంత్రి గతంలో అన్నారని ఇప్పుడు వారేమంటారని ప్రశ్నించారు. ఆత్మగౌరవం ఉంటే వెంటనే టీడీపీ నుంచి బయటికి రావాలని మీడియా ద్వారా తమ్ముళ్లను కోరుతున్నానని కన్నా తెలిపారు. రాజకీయ వ్యభిచారం చేసే వ్యక్తితో మీరుంటారా? అని ప్రశ్నించారు. బయటికి వచ్చి ఆత్మగౌరవంతో తలెత్తుకుని నిలబడండని కన్నా పిలుపునిచ్చారు.