కనిక ఆరోగ్యం ఎలా ఉంది?

కనికా కపూర్ ప్రస్తుతం ఇండియాలో పెద్దగా పరిచయం అవసరంలేని పేరు. లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత క్వారంటైన్ నిబంధనలు పాటించకుండా అందరితో కలిసి తిరిగిన బాలివుడ్ సింగర్ కనికా కపూర్ కు కరోనా సోకిందన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం విషమంగా మారింది. లక్నోలోని సంజయ్ గాంధీ పోస్టు గ్రాడ్యుయేట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో చికిత్స పొందుతున్న కనికా కపూర్ కు నాలుగో సారి కూడా కరోనా పాజిటీవ్ వచ్చింది.

ఈ నెల 9వ తేదీన లండన్ నుంచి వచ్చిన కనికా కపూర్ పెద్ద పార్టీ ఏర్పాటు చేసి పెద్ద పెద్ద వారిని విందుకు పిలిచింది.  దాదాపు 200 మందిని కలిసింది. ఆమె కలిసిన వారిలో బిజెపి ఎంపి దుష్యంత్ సింగ్, వసుంధరా రాజే సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. ఆమెను కలిసిన తర్వాత దుష్యంత్ సింగ్ రాష్ట్రపతిని కలిశారు. మరికొంత మంది ఎంపిలను కూడా ఆయన కలిశారు. తర్వాత ఆమెకు కరోనా లక్షణాలు బయట పడటంతో ఈ నెల 20న ఆమెను క్వారంటైన్ చేశారు. అప్పటి నుంచి చికిత్స జరుగుతున్నా ఆమె పరిస్థితి రోజు రోజుకు క్షీణిస్తూనే ఉందట.

అంతే కాదు కనిక బ్రిటన్ యువ రాజు ప్రిన్స్ చార్లెస్ ను కూడా కలిసినట్లు ఆమె తాజా ఫొటోలను చూస్తే తెలుస్తోంది. ఆయనక్కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే. కనికా కపూర్ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి చూసి ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. మరింత మెరుగైన చికిత్స అందించేందుకు ఆమెను వేరే చోటుకు తీసుకెళ్లేందుకు కూడా వీలు కలగడం లేదని ఆమె కుటుంబ సభ్యుడు ఒకరు చెప్పారు. భగవంతుడిని ప్రార్థించడం మినహా మరేం చేయలేకపోతున్నామని ఆయన నిస్సహాయత వ్యక్తం చేశారు. ఇప్పటికే మూడు శాంపిళ్ళు పాజిటివ్ వచ్చిన కనిక కు నాలుగవ శాంపిల్ కూడా పాజిటివ్ వచ్చిందని,  వైద్యానికి ఆమె శరీరం కూడా సరిగా ప్రతిస్పందించడం లేదని, దేవుడిని ప్రార్ధించడం తప్ప ఏమీ చేయలేక పోతున్నామని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.