జూ.యన్టీర్, లోకేష్ లకి క్లాసు పీకిన రామోజీ?

 

తెలుగుదేశంపార్టీలో రెండువర్గాలుగా చీలిన హరికృష్ణ, బాలకృష్ణలకు వారి శ్రేయోభిలాషి అయిన రామోజీరావు ఇటీవలే తన రామోజీఫిల్మ్ సిటీలో రాజీకుదిర్చినట్లు వార్తలొచ్చాయి. వారికేగాకుండా తెలుగుదేశంపార్టీ తరువాతతరం ప్రతినిదులయిన జూ.యన్టీర్, లోకేష్ లనికూడా కూర్చోబెట్టుకొని రామోజీరావు వాళ్ళకి పార్టీపరిస్థితిని సవివరంగా అర్ధమయ్యేలచెప్పి వారిమద్యన కూడా రాజీ కుదిర్చినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.

 

నందమూరి వంశానికి చెందిన తమ కుటుంబానికి తెలుగుదేశంపార్టీలో ఏ ఒక్కరికీ చంద్రబాబు పదవి ఈయకపోవడంపై హరికృష్ణ అతని కుమారుడు జూ.యన్టీర్, రామోజీరావు ముందు అసంతృప్తి వెలువరించినప్పుడు, ఆయన వారికి చంద్రబాబు తరపున కొన్ని హామీలు ఇచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం పార్టీకోసం అందరు కలిసి కట్టుగా పనిచేసి పార్టీని అధికారంలోకి వచ్చేలా గెలిపించుకొంటే, ఆ తరువాత పార్టీకోసం పనిచేసిన వారికి తప్పక సముచిత గౌరవం లభిస్తుందని ఆయన హామీ ఇచ్చేరు. అందువల్ల, బాలకృష్ణ హరికృష్ణలు ఒకవైపు, జూ.యన్టీర్, లోకేష్ మరో వైపు చేతులు కలిపి పార్టీకోసం పనిచేయాలని రామోజీరావు వారని ఒప్పించినట్లు సమాచారం.

 

ముఖ్యంగా జూ.యన్టీర్, లోకేష్ లకు ఉత్తరప్రదేశ్ లో సైకిల్ పై రాష్ట్రమంతా పర్యటించి ముఖ్యమంత్రి అయిన సమాజ్ వాది పార్టీ యువనాయకుడు అఖిలేష్ సింగ్ యాదవ్ విజయగాధని ఆడియో, వీడియో క్లిప్పింగులతో సహా రామోజీరావు జూ.యన్టీర్, లోకేష్ లకు చూపించి వారికి పార్టీ విజయం కోసం ఏవిదంగా కష్టపడాల్సి ఉంటుందో వివరించినట్లు సమాచారం. అందువల్లే, వారిరువురూ లేదా లోకేష్ ఒక్కడే గానీ నూతన సంవత్సరంలో సైకిల్ యాత్ర మొదలు పెట్టవచ్చును అని తెలిసింది. అయితే సినిమా షూటింగ్ లతో నిత్యం తీరికుండని జూ.యన్టీర్ మాత్రం వెంటనే సైకిల్ యాత్ర మొదలు పెట్టకపోయినా, ఎన్నికల ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలియగానే, తన సినిమాలను, షూటింగులను కొన్నిరోజులు పక్కన పెట్టయినసరే వచ్చి తెలుగుదేశంపార్టీ ప్రచారంలో పాల్గొనవచ్చును అని తెలిసింది. ఈ లోపున లోకేష్ మాత్రం తన పార్టీకి అచ్చొచిన శ్రీకాకుళం జిల్లానుండి త్వరలో సైకిల్ యాత్ర మొదలు పెట్టవచ్చునని సమాచారం.

 

నూతన సంవత్సరం, సంక్రాంతి (అమావాస్య) హడావుడి ముగియగానే, బాలకృష్ణ, హరికృష్ణలు కూడా పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గోనవచ్చునని తెలుస్తోంది. ఇకపై ప్రత్యక్ష రాజకీయాలలో పాల్గొనే లోకేష్ కోసం యన్టీర్ భవనంలో ఒక గదినికూడా సిద్దం చేయబోతున్నారని నేడు వార్తలు వచ్చాయి. వచ్చే ఎన్నికలలో పార్టీని ఎలాగయినా గెలిపించాలని నిజంగా నందమూరివారు, నారవారు కలిసి నడుం బిగిస్తే ఫలితాలు అనుకూలంగానే వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే, అది వారు ఎంత ఐక్యతగా ఉండగలరనేదానిపైనే ఆధార పడిఉంటుంది.