సొంత రాష్ట్రానికి సీబీఐ లక్ష్మినారాయణ
posted on Jun 11, 2013 6:40PM
సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ మహారాష్ట్ర క్యాడర్కు బదిలీ చేసిన నేపథ్యంలో ఆయన ఇవాళ రిలీవ్ అయ్యారు. డీఐజీ వెంకటేష్కు తన బాధ్యతలను అప్పగించారు. తాను రిలీవ్ అవుతున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అవినీతి వల్లే దేశాభివృద్ధి కుంటు పడుతోందని .. ఇప్పటి వరకు రాష్ట్రంలో దర్యాప్తు చేసిన కేసుల వివరాలను సీబీఐ కోర్టుకు తెలిపామని, ఎవరెవరు అవినీతికి పాల్పడ్డారో కోర్టుకు సమర్పించామని” ఆయన తెలిపారు. పెండింగ్లో ఉన్న దర్యాప్తును డీఐజీ వెంకటేష్ బృందం పూర్తి చేస్తోందని తెలిపారు. అయితే కేసుల దర్యాప్తు విషయంలో తనపై ఎలాంటి ఒత్తిడిలేదని తెలిపారు. తాను మీడియాకు ఎలాంటి దర్యాప్తు సమాచారాన్ని లీకు చేయలేదని, అవసరమనిపిస్తే తానే మీడియా నుంచి సమాచారాన్ని సేకరించానని తెలిపారు. సొంత రాష్ట్రంలో పనిచేయడం తనకెంతో సంతోషాన్ని, సంతృప్తినిచ్చిందని లక్ష్మినారాయణ అన్నారు.