చంద్రబాబు నోట్ల ప్రింటింగ్ మిషన్ పెట్టారా?

 

అనంతపురం జిల్లాలో పర్యటించిన సీఎం చంద్రబాబు బైరవానితిప్ప ప్రాజెక్టు వద్ద పైలాన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబును ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి పొగడ్తలతో ముంచెత్తారు. రామలసీమకు ఏ ముఖ్యమంత్రి ఇవ్వనన్ని ప్రాజెక్టులను చంద్రబాబు ఇచ్చారని, బీడు భూములకు కోట్లు వెచ్చించి నీరు ఇస్తున్నారని ప్రశంసలజల్లు కురిపించారు. సీమ ప్రజలంతా చంద్రబాబుకు రుణపడి ఉండాలని అన్నారు. నదుల అనుసంధానం గురించి చాలాకాలంగా విన్నాం.. దాన్ని ఎవరూ చేయలేకపోయారు కానీ చంద్రబాబు కార్యాచరణలో చేసి చూపించారని జేసీ ప్రశంసించారు. నదుల అనుసంధానం వల్లే బైరవానితిప్ప ప్రాజెక్టుకు నీళ్లొస్తున్నాయి.. అందుకు చంద్రబాబుకు ధన్యవాదాలు అన్నారు. పోలవరానికి కేంద్రం నిధులివ్వకుండా మొండిచేయి చూపినా పనులు చేస్తున్నారని.. డబ్బులెక్కడ నుంచి వస్తున్నాయి?.. మీ దగ్గరేమైనా అక్షయ పాత్ర ఉందా? లేక ఆంధ్రా కోసం ప్రత్యేకంగా ఒక ప్రింటింగ్ మిషన్ పెట్టారా?.. ఈ రహస్యం మాత్రం చెప్పాల్సిందేనని జేసీ చంద్రబాబును ఉద్దేశించి సరదాగా వ్యాఖ్యానించారు.