బీజేపీతో పొత్తుకు లోక్ సత్తా రెడీ

 

రాబోయే ఎన్నికల్లో బీజేపీతో పొత్తుకు లోక్‌ సత్తా సంసిద్ధత వ్యక్తం చేసింది. రాష్ట్ర, దేశ ప్రయోజనాల దృష్ట్యా పొత్తులకు సానుకూలమని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ పేర్కొంటూ.. రాబోయే ఎన్నికల్లో కలసి పనిచేయడానికి బీజేపీని మెరుగైన భాగస్వామిగా పేర్కొన్నారు. ‘ఎప్పుడైతే ఒక రాజకీయ పార్టీ స్వచ్ఛందంగా కండబలం, ఉచిత తాయిలాల రాజకీయం చేయకుండా వ్యవహరిస్తుందో.. ఎన్నికల విజయాలమార్గం ముళ్లబాటగా మారుతుంది’అని పేర్కొన్నారు.ఓటర్లకు డబ్బు పంపిణీ వంటి వ్యవహారాల్లో బీజేపీ వైఖరి ఇతర పార్టీలకంటే మెరుగైనదని పేర్కొంటూ ఆ పార్టీతో పొత్తుకు సానుకూల వైఖరి వ్యక్తంచేశారు. పార్టీ సభ్యులు లోతుగా ఆలోచించి.. కొత్త రాజకీయాన్ని కొనసాగిస్తూ ప్రజాప్రయోజనాల్ని పెంపొందించేందుకు ఆచరణాత్మక వ్యూహాన్ని వెలువరించాలని విజ్ఞప్తి చేశారు.