సమావేశం మధ్యలో సడన్ గా ఢిల్లీ వెళ్లిన పవన్.. ఏపీలో కీలక పరిణామాలు!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సడెన్ గా ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరుగుతుండగానే మధ్యలోనే లేచి పవన్ ఢిల్లీకి బయలుదేరారు. కేంద్ర ప్రభుత్వ ప్రముఖుల అపాయింట్‌మెంట్‌ పవన్‌ కు ఖరారయిందని, అందుకే ఆయన హుటాహుటిన ఢిల్లీ వెళ్లారని తెలుస్తోంది. బీజేపీ జాతీయాధ్యక్షుడు, హోంమంత్రి అమిత్ షా తో ఆయన అప్పాయింట్ మెంట్ ఖరారు అయినట్లు సమాచారం.

పవన్ సడన్ గా ఢిల్లీ వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. ఆయన రెండు రోజులుగా కేంద్ర ప్రముఖుల అప్పాయింట్ మెంట్ కోరుతున్నారు. ఏపీ మూడు రాజధానుల వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని ఇటీవల కోరారు. అదే సమయంలో తాను కూడా ఈ మొత్తం వ్యవహారాన్ని కేంద్రంతో చర్చిస్తానని అన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కేంద్ర పెద్దల అప్పాయింట్ మెంట్ కోరారు. ఈరోజు పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఉన్న సమయంలో అప్పాయింట్ మెంట్ ఖరారైనట్లుగా ఫోన్ వచ్చింది. దీంతో వెంటనే పవన్ ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఢిల్లీలో ఆయన పలువురు కీలక వ్యక్తులను కలవనున్నారని సమాచారం. రాజధాని అంశంపై ప్రధానంగా చర్చించే అవకాశముందని తెలుస్తోంది. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ-జనసేన పొత్తు గురించి చర్చించే అవకాశముందని సమాచారం. పవన్ ఢిల్లీ పర్యటన తరువాత ఏపీ రాజకీయాల్లో సమీకరణాలు మారే అవకాశం ఉందని అంటున్నారు. అయితే, ఢిల్లీలో పవన్ ఎవరెవరిని కలుస్తారు..ఏం చర్చిస్తారనే దాని పైన మొత్తం సమీకరణాలు ఆధారపడి ఉన్నాయి.