పాలమూరుపై జైపాల్ కన్ను

 

తెలంగాణా ఏర్పాటు తర్వాతి నుంచి కాస్త గట్టిగా మాట్లాడుతున్న కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి సేఫ్ సీటుపై కన్నేశారు. ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న చేవెళ్ల లోక్‌సభ స్థానంలో ఎదురుగాలి వీస్తుండడంతో వచ్చే ఎన్నికల్లో మహబూబ్‌నగర్ నుంచి బరిలో దిగేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌లో అసమ్మతి రాజకీయాలు తన గెలుపుపై ప్రభావం చూపుతాయనే ఆందోళనతోనే ఆయన సొంత నియోజకవర్గం మహబూబ్‌నగర్ వైపు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. అందుకే ఇప్పటివరకు చేవెళ్లలో పర్యటించలేదని, మహబూబ్‌నగర్‌లో జైపాల్ వర్గం కొంతకాలంగా క్రియాశీలకంగా మారిందని అంటున్నారు. తన అనుచరుడైన ఉద్దమర్రి నరసింహారెడ్డికి మేడ్చల్ అసెంబ్లీ టికెట్ ఇప్పించుకుంటున్న జైపాల్‌రెడ్డి... సిట్టింగ్ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డికి చేవెళ్ల లోక్‌సభ టికెట్ ఇప్పించే యోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. తద్వారా అటు సబిత వర్గం మీద పైచేయి సాధించడంతో పాటు తన అనుయాయుడికి మేడ్చల్ టికెట్ ఇప్పించుకోవచ్చన్నది జైపాల్ ద్విముఖ వ్యూహమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.