జగన్ విడుదల కాంగ్రేసుకి మరణ శాసనం కానున్నదా?
posted on Jan 8, 2013 3:30PM
ఒక సమున్నత స్థాయిలోఉన్న తనను జైలుకీడ్చి తన జీవితంతో చెలగాటమాడుకొంటున్న కాంగ్రెస్ పార్టీపై పగతీర్చుకొనేందుకు జగన్మోహన్ రెడ్డి సమాయత్తం అవుతున్నట్లు సమాచారం. సిబిఐ మరియు కాంగ్రెస్ పార్టీలు రెండూ కూడా ఎంత ప్రయత్నించినా తనను మరో రెండు నెలలకు మించి జైల్లో ఉంచడం అసంభవం అని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తనని అరెస్ట్ చేయకముందు కాంగ్రెస్ పార్టీపట్ల కొంతయినా సానుకూలధోరణి కలిగిఉన్నఅతను, ఇప్పుడు జైలు నుంచి విడుదల అయిన తరువాత ఇక ఆపార్టీని వదిలిపెట్టేదిలేదని తనను కలవవచ్చిన పార్టీ నేతలలో చెపుతున్నట్లు తెలిసింది. తన విడుదల తేదీనే కాంగ్రెస్ పతనానికి ముహూర్తంగా ఆయన చెప్పినట్లు తెలుస్తోంది.
ఇంత కష్టం భరిస్తున్నతనని కాంగ్రెస్ పార్టీ ఇంకా కొత్తగా పెట్టే ఇబ్బంది ఏముంటుంది? అనే ఒక రకమయిన తెగింపువచ్చిన జగన్ మోహన్ రెడ్డి, తనకు ఈ దుస్థితి కల్పించిన కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తుడిచిపెట్టేయాలని భావిస్తునట్లు తెలుస్తోంది. జైలు నుంచి బయటకి రాగానే తన మొట్ట మొదటి కార్యక్రమం కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చడమేనని తన నేతలతో చెప్పడమే గాక, అందుకు తగిన పధక రచన కూడా సిద్దంచేసినట్లు సమాచారం. ముందుగా, కిరణ్ కుమార్ ప్రభుత్వంలోంచి తమ పార్టీవైపు వచ్చే వారి పేర్లను సేకరించే భాద్యతను పార్టీలోని కొందరు ముఖ్యనేతలకు, తన సాక్షి మీడియాలో పనిచేస్తున్న ఒక ముఖ్యవ్యక్తికీ అప్పజేప్పినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం తెదేపా, తెరాసలు రెండు పార్టీలు తమ పార్టీ ఏదో ఒకరోజున కాంగ్రేసులో కలుస్తుందనే ప్రచారం ఉదృతంగా చేస్తున్న కారణంగా, ఇతర పార్టీ నేతలు తమ పార్టీలో జేరెందుకు ఆసక్తి చూపుతున్నపటికీ, ఈ కారణంగానే చేరేందుకు బయపడుతున్న విషయం చర్చకు రావడంతో, అటువంటి నేతలకి, కార్యకర్తలకు భరోసా ఇచ్చేందుకు ఇక ముందు కాంగ్రెస్ పార్టీతో పూర్తీ స్థాయి యుద్దమే తప్ప పొత్తులు,కలయికలు ఉండబోవని స్పష్టంగా తెలియజేయాలని జగన్ తన నేతలకి చెప్పినట్లు తెలిసింది. తద్వారా, తమపై జరుగుతున్నా దుష్ప్రచారాన్ని అడ్డుకోవడమే గాకుండా, పార్టీలోకి వచ్చేఆలోచన ఉన్న ఇతర పార్టీ నేతలకి, కార్యకర్తలకీ కూడా భరోసా కలిపించినట్లు ఉంటుందని జగన్ భావిస్తున్నారు.
అదే విదంగా, షర్మిల తన పాదయాత్రను మద్యలో ఆపేయడం, దానిపై తమ శత్రుపక్షాలు మరియు మీడియాలో కొన్ని వర్గాలు చేస్తున్న విష ప్రచారం అడ్డుకొనేందుకు షర్మిల చేత మళ్ళీ త్వరలో పాద యాత్ర మొదలు పెట్టించాలని కూడా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్నీపార్టీ కార్యకర్తలకి మెసేజ్ లు ద్వారా తెలియజేసి ఆమెకు వారి పూర్తి సహకారం అందజీయాలని జగన్ మాటగా కోరనున్నట్లు తెలుస్తోంది. ఆమెకి సుదీర్గ పాదయాత్రలు చేసే శక్తి లేనప్పటికీ, కొద్ది రోజుల విరమాలతో నయినా, తప్పనిసరిగా మళ్ళీ ఆమె చేత పాదయాత్రలు మొదలుపెట్టించాలని, ఒకవేళ తానూ గానీ ఈ మద్యలో విడుదలయినట్లయితే, అక్కడి నుండి తానే స్వయంగా పాదయాత్ర చేస్తూ రాష్ట్రంలో వీలయినంత ఎక్కువ మంది కాంగ్రేసు నేతలను, కార్యకర్తలను తన పార్టీ వైపు తిప్పుకోవడానికి గట్టి ప్రయత్నం చేయాలనీ నిర్నయించుకోన్నట్లు తెలుస్తోంది.
షర్మిల చేత పాదయాత్ర మళ్ళీ మొదలు పెట్టించడం ద్వారా పార్టీ శ్రేణులకు ఉత్సాహం కలిగించడమే కాకుండా, తమ కుటుంబములో పార్టీ నాయకత్వపదవికోసం అంతర్గత కలహాలు జరుగుతున్నట్లు మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని అడ్డుకట్ట వేయవచ్చునని భావిస్తునట్లు తెలుస్తోంది. ఏది
ఏమయినపటికీ, షర్మిల గనుక త్వరలో మళ్ళీ పద యాత్ర మొదలు పెట్టినట్లయితే, జగన్ మోహన్ రెడ్డి ఆలోచనలు అమలు మొదలయినట్లు భావించవచ్చును.