ఇండిగో విమానంలో కరోనా రోగి.. 130 మంది క్వారంటైన్!

దాదాపు రెండు నెలల తరువాత దేశీయ విమానాల రాకపోకలు ప్రారంభం కాగా, కరోనా పాజిటివ్ వ్యక్తి ప్రయాణం సాగించడం కలకలం రేపింది. ఈ ఘటన చెన్నై-కోయంబత్తూర్ ఇండిగో విమానంలో వెలుగుచూసింది. చెన్నై నుంచి కోయంబత్తూర్ నగరానికి వచ్చిన 6ఈ 381 ఇండిగో విమానం నుంచి దిగిన ప్రయాణికులను పరీక్షిస్తుండగా.. చెన్నైలోని ఓ స్టార్ హోటల్ లో పనిచేస్తున్న ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. వెంటనే అతన్ని కోయంబత్తూర్ లోని వినాయక్ హోటల్ కు తరలించి నిర్బంధంలో ఉంచారు. అనంతరం అతన్ని ఈఎస్ఐ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. అతనితో కలిసి ప్రయాణించిన 129 మందికి వైద్యపరీక్షలు చేయగా వారికి నెగిటివ్ వచ్చినప్పటికీ, వారందరినీ 14రోజుల పాటు హోం క్వారంటైన్ కు తరలించారు. 

విమానంలో ప్రయాణికులంతా ఫేస్ మాస్క్ లు, ఫేస్ షీల్డు లు, గ్లౌజులు ధరించి అన్ని ముందుజాగ్రత్తలు తీసుకున్నారని, కరోనా బాధితుడికి సమీపంలో ఎవరూ కూర్చోలేదని ఇండిగో అధికారులు చెప్పారు. సేవలందిస్తున్న విమానాలను తాము క్రమం తప్పకుండా శానిటైజ్ చేస్తున్నామని, విమాన క్యాబిన్ సిబ్బందిని కూడా 14 రోజుల పాటు హోం క్వారంటైన్ చేశామని ఇండిగో వెల్లడించింది.