ఢిల్లీలో విధ్వంసానికి ఇండియన్ ముజాహిద్దీన్ కుట్ర

 

విజయదశమి, దీపావళి పండగల సందర్భంగా న్యూఢిల్లీలో భారీ విధ్వంసానికి తీవ్రవాదులు కుట్ర పన్నినట్టు బయటపడింది. ఈమధ్య ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లో పోలీసులకు దొరికిపోయిన ఇండియన్ ముజాహిద్దీన్ తీవ్రవాది అజీజ్ షేక్ బయటపెట్టాడు. ఇండియన్ ముజాహిదీన్‌కు కీలక సంధానకర్త, హవాలా మార్గంలో నిధులను తరలించడంలో నిష్ణాతుడైన అజీజ్ షేక్ గత ఏడాది యాసీన్ భత్కల్‌ను అరెస్టు చేసిన వెంటనే నేపాల్‌కు పారిపోయి అప్పటి నుంచి అక్కడే ఉన్నాడు. అయితే ఢిల్లీ చేరుకోవాలంటూ అతడ్ని పాకిస్థాన్‌లోని మిలిటెంట్లు రియాజ్ భత్కల్, మొహిసిన్ చౌదరిలు ఆదేశించినట్టు చెప్పాడు. పోలీసులు గుర్తు పట్టకుండా ఉండటం కోసం బ్రేక్ జర్నీలు చేయాలని, నేరుగా ఢిల్లీ వెళ్లవద్దని కూడా వారు అతడికి ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చారు. ఢిల్లీ చేరుకున్న తర్వాత తదుపరి ఆదేశాలు ఇస్తామని వారు చెప్పారని అతను వెల్లడించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో భద్రతను మరింత పటిష్టం చేయడానికి పోలీసులు నడుం బిగించారు.