కశ్మీర్‌లో ఎవరైనా గన్ తో కనిపిస్తే కాల్చిపారేస్తాం

 

పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో.. ఉగ్రవాదులతో చేతులు కలుపుతున్న కశ్మీరీ యువతకు భారత సైన్యం గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇకపై ఆయుధంతో ఎవరు కనిపించినా కాల్చిపారేస్తామని హెచ్చరించింది. పుల్వామా దాడి సూత్రధారులను భారత సైన్యం హతమార్చిన నేపథ్యంలో  సైనికాధికారులు ఇవాళ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. 15 కార్ప్స్ కమాండర్ కన్వాల్ జీత్ సింగ్ దిల్లాన్ మాట్లాడుతూ.. ‘పుల్వామా ఉగ్రదాడి జరిగిన 100 గంటల లోపే దీనికి కారణమైన జైషే మహ్మద్ నాయకత్వాన్ని మట్టుబెట్టాం. పాకిస్తాన్ నేతృత్వంలోనే కశ్మీర్‌లోయలో జైషే మహ్మద్‌ ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తోంది. కశ్మీర్‌లో ఇకపై చట్టవిరుద్ధంగా ఎవరు ఆయుధాలతో కనిపించినా కాల్చిపారేస్తాం. ఈ విషయంలో ఏమాత్రం కనికరం చూపించేది లేదు.’ అని హెచ్చరించారు. ఉగ్రవాదుల్లో చేరిన యువతను వారి కుటుంబ సభ్యులు వెంటనే వెనక్కి పిలిపించుకోవాలని అల్టిమేటం జారీ చేశారు. ఉగ్రవాదులంతా వెంటనే లొంగిపోవాలనీ.. లేకుంటే సైన్యం చేతుల్లో మరణించక తప్పదని స్పష్టం చేశారు. జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని నిలువరించేందుకు తమకు ఇంతకు మించి వేరే మార్గం లేదని దిల్లాన్ పేర్కొన్నారు.