సీఎం గారి ఆఫీస్ కు బంగారం స్మగ్లింగ్ మరక..!

కరోనా ను హ్యాండిల్ చేయడంలో మంచి పేరు తెచ్చుకుంది కేరళలోని వామపక్ష పినరై విజయన్ ప్రభుత్వం. దేశంలోనే మొట్టమొదటి కరోనా కేసు నమోదైంది కేరళలోనే.. అయినా కూడా ఇప్పటి వరకు అక్కడ మొత్తం కరోనా కేసుల సంఖ్య 5700 దాటలేదు. ఇంత గొప్ప ఘనత సాధించిన పినరై విజయన్ ప్రభుత్వానికి తాజాగా బంగారం స్మగ్లింగ్ మరక అంటింది. ఈ స్మగ్లింగ్ తో ఆ ప్రభుత్వానికి డైరెక్ట్ గా సంబంధం లేకపోయినా ఒక అధికారి వల్ల ఈ చెడ్డపేరు వచ్చిందని తెలుస్తోంది.

వివరాలలోకీ వెళితే కేరళ కేపిటల్ తిరువనంతపురం లోని ఎయిర్ పోర్ట్ కస్టమ్స్ అధికారులు మొన్న ఆదివారం జరిపిన తనిఖీలలో ఏకంగా 15 కోట్ల విలువైన 30 కిలోల బంగారం పట్టుబడింది. ఈ బంగారం నగరం లోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎంబసీ పేరుతొ ఆహార పదార్ధాల పార్సెల్ గా బుక్ అయినట్లు గుర్తించారు అధికారులు. దీని పై అధికారులు దర్యాప్తు చేపట్టగా సూత్రధారి స్వప్న సురేష్ అనే మహిళ అని తేలింది. దీంతో రాష్ట్రం లోని ప్రతిపక్షాలు విజయన్ సర్కార్ పై విరుచుకు పడుతూన్నాయి. కారణం ఏంటంటే బంగారం స్మగ్లింగ్ సూత్రధారి స్వప్న రాష్ట్ర ఐటి శాఖ ఉద్యోగి కావడం పైగా ఆ శాఖను సాక్షాత్తు సీఎం చూస్తూ ఉండడమే. అంతే కాకుండా ఆమె అంతకుముందు యుఎఇ ఎంబసి లో కూడా పని చేసింది. దానిని అడ్డుపెట్టుకుని ఎంబసీ పేరుతొ కొన్ని డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసి ఆ రాయబార కార్యాలయం ముసుగులో ఆమె స్మగ్లింగ్ కు పాల్పడినట్లుగా తెలుస్తోంది. దీనికి ఎంబసీలోని మరో ఉద్యోగి కూడా సహకరించినట్లుగా అధికారులు గుర్తించారు. 

ఐతే ఈ వ్యవహారం లో నిందితురాలు స్వప్నను కాపాడటానికి సీఎంవో లోని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి కూడా ప్రయత్నించారని బయటకు వచ్చింది. దీంతో అప్రమత్తమైన విజయన్ ప్రభుత్వం ముందుగా ఆమెను ఆ పోస్ట్ నుండి డిస్మిస్ చేసింది. ఆ తరువాత సిఎంఓ లోని సీనియర్ అధికారిని కూడా బదిలీ చేసి అతని స్థానం లో మరో అధికారిని నియమించినట్లు సమాచారం.