ఇళయరాజా తమ్ముడు.. బీజేపీ తీర్థం..

 

ప్రముఖ సంగీత దర్శకుడు, స్వర చక్రవర్తి ఇళయరాజా తమ్ముడు గంగై అమరన్ భారతీయ జనతాపార్టీలో చేరబోతున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో పార్టీలో చేరడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆయన సన్నిహితులు వెల్లడించారు. శనివారం నాడు చెన్నైలో అమిత్‌షా బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభలో గంగై అమరన్ బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. గంగై అమరన్‌తోపాటు పలువురు తమిళ సినీ ప్రముఖులు కూడా ఈ సభలోనే బీజేపీ తీర్థం పుచ్చుకునే అవకాశం వుందని తెలుస్తోంది. గంగై అమరన్ తమిళ చిత్ర పరిశ్రమలో రచయిత, నిర్మాత. ఆయన కుమారుడు ప్రేమ్‌జీ అమరన్ కూడా తమిళ సినిమా రంగంలో నటుడిగా, నిర్మాతగా చాలా బిజీగా వున్నారు. తమిళనాడులో డీఎంకే, అన్నా డీఎంకేలకు ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీని నిలపడానికి కృషి చేస్తానని గంగై అమరన్ చెబుతున్నారు.