ఎమ్మెల్యేగా గెలిచినా రాజీనామా చేస్తా

నల్గొండలో బహిరంగ సభ నిర్వహించిన కేసీఆర్‌ జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాల్లో 12 గెలుస్తామని అని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.నల్గొండ పట్టణంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నల్గొండ జిల్లాలో 10 స్థానాల్లో కాంగ్రెస్‌ విజయం సాధించకపోతే తాను ఎమ్మెల్యేగా గెలిచినా రాజీనామా చేస్తానని సవాల్‌ చేశారు.రౌడీలకు, దోపిడీదారులకు కేసీఆర్ టికెట్లు ఇచ్చారని, రౌడీలను గెలిపిస్తే నల్గొండలో నిత్యం హత్యలు, దోపిడీలే అని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్‌ వేల కోట్లు దోచుకుంటున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు. మూడేళ్లలో శ్రీశైలం ఎడమ కాలువ (ఎస్ఎ‌ల్‌బీసీ) సొరంగమార్గం పూర్తి చేస్తానని హామినిచ్చిన కేసీఆర్‌ నాలుగున్నరేళ్ల పాలనలో ఎందుకు నిర్లక్ష్యం వహించారని ధ్వజమెత్తారు. ఎస్ఎ‌ల్‌బీసీలో కమీషన్లు రావనే పట్టించుకోలేదని విమర్శలు గుప్పించారు. జగదీశ్‌రెడ్డి, ఆయన అనుచరులు దోచుకునేందుకే దామరచర్ల థర్మల్ ప్లాంట్‌ను నిర్మిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే దామరచర్ల ప్లాంట్‌ను ఆపేస్తామన్నారు.ఈ ప్లాంట్ల వల్ల మిర్యాలగూడ పరిసరాలు కాలుష్యమవుతున్నాయని పేర్కొన్నారు.మంత్రి వర్గంలో ఒక్క మహిళా మంత్రిని లేకుండా చేసి బతుకమ్మ చీరల గురించి కేసీఆర్‌ గొప్పలు చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.