ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య

అప్పు తీసుకున్నాడు. అప్పు ఇచ్చిన వ్యక్తి భార్యకు గాలం వేశాడు. మెళ్లగా ముగ్గులోకి దింపాడు. ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆమె సైతం భర్తను కాదని ప్రియుడికి బాగా దగ్గరైంది. వన్ ఫైన్ డే.. ఆ విషయం భర్తకి తెలిసింది. ఇద్దరికీ వార్నింగ్ ఇచ్చాడు. ఇక తమ అక్రమ యవ్వారం సాగదనుకుంది ఆ భార్య. ఇక అంతే. తన భర్తను చంపేయమంటూ లవర్ ను రెచ్చగొట్టింది. ప్రేయసి డైరెక్షన్ లో.. ఆమె భర్తకు ఫుల్ గా తాగించి.. గొంతు పిసికి చంపేసి.. కాలువలో పడేశాడు. కట్ చేస్తే, పోలీసుల ఎంట్రీతో విషయం మొత్తం బయటకు వచ్చింది. వారి అక్రమ సంబంధం గుట్టు రట్టైంది. భర్తను చంపించిన భార్య, చంపిన లవర్.. ఇద్దరూ కటకటాల పాలయ్యారు. 

కరీంనగర్ జిల్లాలో జరిగిందీ మర్డర్. కొత్తపల్లి మండలం రేకుర్తికి చెందిన మానుపాటి రాజయ్య నగరపాలక సంస్థలో కాంట్రాక్ట్ వర్కర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ మండలం మడద గ్రామానికి చెందిన ఎనగందుల బాబు మేస్త్రీ పని చేస్తుంటాడు. ఏడాది క్రితం మధ్యవర్తి సాయంతో రాజయ్య దగ్గర బాబు అప్పు తీసుకున్నాడు. ఆ తర్వాత వారిద్దరి పరిచయం మరింత పెరిగింది. అప్పు చెల్లించే విషయమై తరుచూ రాజయ్య ఇంటికి వచ్చేవాడు బాబు. ఆ సమయంలో రాజయ్య భార్య బాబుకు చాలా క్లోజ్ అయింది. తన భార్య బాబుతో సన్నిహితంగా ఉండటం గమనించిన రాజయ్య వారిద్దరినీ మందలించాడు. అప్పటి నుంచీ భార్యాభర్తల మధ్య తరుచూ గొడవలు జరిగేవి. తమ అక్రమ సంబంధానికి భర్త అడ్డంకి అని భావించిన భార్య.. రాజయ్యను అడ్డు తొలగించాలని బాబును పురికొల్పింది. ఇద్దరూ కలిసి పక్కాగా ప్లాన్ చేశారు. ప్లాన్ ప్రకారం.. పార్టీ ఇస్తానంటూ రాజయ్యను ఆటోలో మడద తీసుకెళ్లాడు బాబు. అక్కడ మద్యం తాగించి స్పృహలో లేకుండా చేశాడు. అటు నుంచి, మానకొండూర్‌ మండలం ముంజంపల్లి కాకతీయ కెనాల్‌ దగ్గర ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్లాడు. ఎవరూ లేరని నిర్ధారించుకున్నాక.. రాజయ్య మెడ నులిమి చంపేశాడు. డెడ్ బాడీని కెనాల్‌లో పడేశాడు. ఏమీ తెలీనట్టు ఇంటికి తిరిగెళ్లిపోయాడు బాబు. 

భర్త ఇంటికి రాలేదని పోలీస్ స్టేషన్లో రాజయ్య భార్య ఫిర్యాదు చేసింది. రెండు వారాల తర్వాత మహబూబాబాద్‌ జిల్లా కొరివి పీఎస్ పరిధిలోని కాకతీయ కెనాల్‌లో రాజయ్య మృతదేహం లభించింది. విచారణలో భాగంగా పోలీసులకు రాజయ్య భార్యపై అనుమానం వచ్చింది. గట్టిగా ప్రశ్నిస్తే నిజం ఒప్పుకుంది. పోలీసుల దర్యాప్తులో భార్యే హత్య చేయించిందని తేలింది. హత్య చేసిన బాబును, భర్త హత్యకు ఉసిగొల్పిన భార్యను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు పోలీసులు. ఇలా.. వారి అక్రమ సంబంధం విషాదాంతమైంది.