జగన్ రూటు సపరేటు.. దేశంలో శానసమండలి కావాలని కోరిన పది రాష్ట్రాలు!

దేశంలో ఆరు రాష్ట్రాల్లో మాత్రమే శాసన మండలి ఉందని.. మన రాష్ర్టానికి శాసనమండలి అవసరం లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గట్టిగా చెబుతుంటే, మరోవైపు ధర్మాన ప్రపంచంలో ఎగువ సభలు ఎన్నెన్ని దేశాల్లో ఉన్నాయో లెక్కలు వివరిస్తున్నారు. వాటిలో ఎంత నిజముందో వారికే తెలియాలి కానీ ప్రస్తుతం దేశంలో తమ రాష్ర్టానికి శాసనమండలి పెట్టుకునే అవకాశం ఇవ్వాలంటూ 10 రాష్ట్రాలు కేంద్రానికి తీర్మానాలు పెట్టకున్నాయి. వాటి పై కేంద్రం ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తే అప్పుడు శాసన మండలి ఏర్పాటు చేసుకుందామని ఎదురుచూస్తున్నాయి. 

గతంలో శాసనమండలిని రద్దు చేసుకుని మళ్లీ కావాలని కోరుకుంటున్న రాష్ట్రాలు ఐదు ఉన్నాయి. కొత్తగా ఏర్పాటు చేసుకునే ఛాన్స్ ఇవ్వాలని మరో ఐదు రాష్ట్రాలు కోరుతున్నాయి. శాసన మండలిని ఏర్పాటు చేసుకోవడం అనేది రాష్ట్రాల ఇష్టం, ఆ ప్రకారం మొదట్లో కొన్ని రాష్ట్రాలు శాసన మండలి ఏర్పాటు చేసుకున్నాయి. ఆ తర్వాత మధ్యప్రదేశ్, పంజాబ్, తమిళనాడు, బెంగాల్ అవసరం లేదని రద్దు చేసుకున్నాయి. మళ్లీ కొన్నేళ్లుగా తమకు మండలి అవసరముందని ఏర్పాటు చేయాలంటూ కేంద్రానికి తీర్మానాలు పంపుతున్నాయి. గతేడాది మధ్యప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం చేసి పంపింది. మధ్యప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 2018 లో మండలిని పునరుద్దరించాలని మోదీ సర్కార్ కు తీర్మానం పంపారు. పంజాబ్ ఇప్పటికీ మూడు సార్లు తీర్మానాలు చేసి పంపింది. బెంగాల్ 2017 లో తీర్మానం చేసి పంపినా కేంద్రం పట్టించుకోవడం లేదు. 

ఇప్పటి వరకు శాసన మండలి ఏర్పాటు చేసుకోని ఐదు రాష్ట్రాలు తమ రాష్ర్టానికి అవకాశమివ్వాలని కోరుతూ కేంద్రానికి తీర్మానాలు పంపాయి. ఒడిష, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఇప్పటి వరకు కౌన్సిల్ లేదు. గత రెండు మూడేళ్లుగా ఈ రాష్ట్రాల అసెంబ్లీలో తీర్మానాలు చేసి పంపినా ఇంత వరకు కేంద్రం స్పందించలేదు. శాసన మండలికి సంబంధించి రాష్ట్రాలు పంపే తీర్మానాలను కేంద్రం వరుసగా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ లెక్కన ఏపీ సర్కారు చేసే తీర్మానాన్ని ఈ పది తీర్మానాల తర్వాతే కేంద్రం పరిగణిస్తుంది. వాటినే ఏళ్ల తరబడి పెండింగ్ లో పెట్టిన కేంద్రం జగన్మోహనరెడ్డి సర్కారు చేసిన తీర్మానాన్ని ఆఘమేఘాల మీద పరిష్కరిస్తుందా అన్నది చర్చ నీయాంశంగా మారింది.