సెల్ టవర్ ఎక్కిన నలుగురు యువకులు... అమరావతిలో ఉద్రిక్తత!!
posted on Jan 18, 2020 3:15PM
ఏపీలో రాజధాని పోరాటం మరింత ఉధృతమవుతోంది. నెలరోజులుగా అలుపెరగకుండా పోరాటం చేస్తున్న అమరావతి ప్రాంత ప్రజలు.. రాజధానిని తరలించడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదని తేల్చి చెబుతున్నారు. వైసీపీ సర్కార్ రాజధాని మార్పు విషయంలో వేగంగా అడుగులు వేస్తుండటంతో.. ప్రజలు ఉద్యమాన్ని ఉదృతం చేశారు. దీక్షలు, ధర్నాలు, హోమాలు, గవర్నర్ కి ఫిర్యాదులు, ప్రధానికి లేఖలు ఇలా అన్ని రకాల శాయశక్తులా పోరాడుతున్నారు. అయితే తాజాగా నలుగురు యువకులు రాజధాని కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారు. తుళ్లూరులో సెల్ టవర్ ఎక్కిన నలుగురు యువకులు.. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే సెల్ టవర్ మీద నుండి దూకి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వారి కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.