కాంగ్రెస్ మార్క్ కమిటీ
posted on Aug 6, 2013 6:38PM
తెలంగాణ ప్రకటణతో అట్టుడుకుతున్న పరిస్థితులను చక్కదిద్దేందుకు కాంగ్రెస్ మరోసారి తన పాత అస్త్రాన్ని ప్రయోగించింది. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడ్డ ప్రతిసారి కమిటీ ఏరుతో కాలయాపన చేసిన కాంగ్రెస్ ఈసారి సీమాంద్ర అల్లర్ల చలకలార్చేందుకు అదే అస్త్రాన్ని వాడుతుంది.
ప్రకటనకు ముందే చేయాల్సిన పనిని కాస్త ఆలస్యంగా ప్రకటన తరువాత మొదలుపెట్టింది. ఈ కమిటీలో కూడా ఆంద్ర ప్రదేశ్నుంచి ఏ ఒక్కరికి స్ధానం కల్పించలేదు. కమిటీ సభ్యులుగా ఎకె ఆంటోని, దిగ్విజయ్సింగ్, వీరప్పమొయిలీ ఇరు పక్షాల వాదనలను విననున్నారు.
వివాద రహితుడిగా పార్టీతో పాటు దేశ రాజకీయాల్లో కూడా మంచి పట్టున్న ఆంటోనికి విలీనం స్పెషలిస్ట్గా కూడా పేరుంది, చిరంజీవి మూన్నాళ్ల ముచ్చటగా ముగించిన ప్రజారాజ్యం పార్టీ విలీనంలో కీలక పాత్ర పోషించారు. ప్రస్థుతం ఈయన రాజకీయ చతురత టిఆర్ఎస్ విలీనానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
ఇక ప్రస్థుతం రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్గా వ్యవహరిస్తున్న దిగ్విజయ్ సింగ్ విభజన స్పెషలిస్ట్ గతంలో రాష్ట్రాలు విడిపోయిన సందర్భంలో ఆ రాష్ట్రాలతో పరోక్షంగానో ప్రత్యక్షంగానో సంబందం ఉన్న డిగ్గీ ఆంద్ర ప్రదేశ్ విషయంలో కూడా అంతే వేగంగా పనిముగించేశారు. ఇక మూడో వ్యక్తి వీరప్పమొయిలికి కూడా రాష్ట్ర పరిస్ధితులపై మంచి అవగాహన ఉంది. వైయస్ రాజశేఖర్రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఈయనకు రాష్ట్రనాయకులతో సన్నిహిత సంభందాలు ఉన్నాయి. మరి ఈ కమిటీ రాష్ట్రంలో పెల్లుబుకుతున్న ఆగ్రహ జ్వాలలను ఎంతవరకు చల్లారుస్తుందో చూడాలి.