ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు సీరియస్.. ప్రజల సమస్యలు పట్టవా మీకు?

తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో వాదనలు జరిగాయి. ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని అటు ఆర్టీసీ జేఏసీకి, ఇటు ప్రభుత్వానికి హైకోర్టు చురకలు వేసింది. ప్రభుత్వం, యూనియన్ల మధ్య ప్రజలు నలుగిపోతున్నారని, నిరసనలు తెలిపేందుకు అనేక మార్గాలు ఉన్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. కార్మికుల డిమాండ్లు న్యాయ సమ్మతం కావొచ్చు.. కానీ పండుగ సమయంలో రవాణా నిలిపేస్తే ఎలా అని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజల ఇబ్బందులను కార్మిక సంఘాలు పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. ఆర్టీసీ కార్మికులు వెంటనే సమ్మె విరమించి, ప్రభుత్వంతో చర్చలు జరపాలని సూచించింది. వెంటనే చర్చలు ప్రారంభించాలని అటు ప్రభుత్వాన్ని కూడా ఆదేశించింది.

ప్రజలపై సమ్మె ప్రభావం పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. అయితే, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే విద్యా సంస్థలకు సెలవులు ఎందుకు పొడిగించారని కోర్టు ప్రశ్నించింది. దాదాపు 4 వేల బస్సులు నడవడం లేదని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కోర్టు ఆక్షేపించింది. ప్రభుత్వానికి ముందు చూపు లేదని వ్యాఖ్యానించింది.

ఆర్టీసీని విలీనం చేయలేమని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆర్టీసీని విలీనం చేస్తే మరికొన్ని కార్పొరేషన్లు.. ముందుకు వస్తాయన్నారు. అయితే ప్రజల ఇబ్బందులను మాత్రమే తమ దృష్టికి తేవాలన్న హైకోర్టు సూచించింది. ప్రస్తుతం 75 శాతం బస్సులను నడుపుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం.. హైకోర్టుకు తెలిపింది. కొద్ది రోజుల్లో మిగతావాటిని కూడా పునరుద్ధరిస్తామని చెప్పింది. ఈ సందర్భంగా 4000 బస్సులకు డ్రైవర్లు, కండక్టర్లను ఎలా తెస్తారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.

చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని కార్మిక సంఘాలు హైకోర్టుకు తెలిపాయి. ప్రభుత్వం చర్చలకు పిలవడం లేదని ఆరోపించాయి. చివరి అస్త్రంగా సమ్మెకు వెళ్లినట్లు కోర్టుకి వివరణ ఇచ్చాయి. ఆర్టీసీకి పూర్తి స్థాయి ఎండీ లేరని, ఇబ్బందులు ఎవరికి చెప్పుకోవాలో తెలియడంలేదని, చాలా కాలంగా సమస్యలు అలానే ఉన్నాయని కార్మిక సంఘాలు కోర్టు దృష్టికి తీసుకెళ్లాయి. సమస్య ఆర్టీసీ యాజమాన్యం, కార్మికుల మధ్య మాత్రమే కాదని.. ఆది ప్రజల సమస్యగా మారిందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

ప్రభుత్వం, యూనియన్ల పట్టుదలతో మధ్యలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రభుత్వానికి ప్రజల సమస్యలు పట్టవా అని కోర్టు ప్రశ్నించింది. సమస్యను రెండు రోజుల్లో పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆర్టీసీకి ఎండీని ఎందుకు నియమించలేదో తెలిపాలని ప్రశ్నించింది. కార్మికుల్లో విశ్వాసం పెంచేందుకు తక్షణం ఆర్టీసీ ఎండీని నియమించాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది.