కేసీఆర్ కి షాక్.. ధర్నాచౌక్‌పై ఆంక్షలు ఎత్తేసిన హైకోర్టు

 

హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్దనున్న ధర్నాచౌక్‌పై తెలంగాణ ప్రభుత్వం విధించిన ఆంక్షలను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ప్రభుత్వం విధించిన ఆంక్షలను తాత్కాలికంగా ఎత్తివేస్తూ ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసుల అనుమతితో నిరసన కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది.

గతంలో కేసీఆర్ ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్షాలు, ఇతర ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున నిరసన తెలిపాయి. ధర్నాచౌక్ తరలింపు సరికాదంటూ .. ప్రభుత్వ నిర్ణయంపై పునరాలోచించాలంటూ డిమాండ్ చేశాయి. హైకోర్టును ఆశ్రయించడంతో తాజాగా మధ్యంతర ఉత్వర్వులు జారీ చేసింది. ధర్నాచౌక్‌ ఎత్తివేతపై ఏడాదిగా ప్రభుత్వం వివరణ ఇవ్వకపోవడంపై అసహనం వ్యక్తం చేసిన హైకోర్టు ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేసే హక్కు ఉంటుందని తెలిపింది. ధర్నా చౌక్‌ ఎత్తివేయడాన్ని సవాల్‌ చేస్తూ.. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌, ప్రొఫెసర్‌ పీఎల్‌ విశ్వేశ్వరరావు దాఖలు చేసిన పిటీషన్ పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాధాకృష్ణన్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.