పంచాయతీరాజ్ శాఖలో భారీ అవినీతి :- సీఎం సార్ మీరే దిక్కు అంటున్న కాంట్రాక్టర్లు

 

రాజ్యం బాగుండాలంటే రాజు ఒక్కడే బాగుంటే సరిపోదు కదా.. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ సీఎం అయిన తరువాత రివర్స్ టెండరింగ్ అంటూ ఆయన నిధులను ఆదా చేస్తుంటే శాఖాధికారులు మాత్రం స్వాహా చెయ్యడానికి చూస్తున్నారు.గ్రామాల్లోని రోడ్లు..మౌలిక వసతులలో పెను మార్పులు తీసుకురావడానికి ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టు మొదలైంది. అలాంటి ప్రాజెక్టుకు అవినీతి మరక అంటిస్తున్నారు.


టెండర్ లు పూర్తయి ఒప్పందం చేసుకున్న పనులను రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నారు.ఏపీలోని పట్టణాలను.. నియోజకవర్గాలను.. కలుపే రోడ్లను అభివృద్ధి చెయ్యాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. అధికారుల సుదీర్ఘ కసరత్తు తరువాత వందల కిలోమీటర్లలో రోడ్లు నిర్మించి ఈ ప్రాజెక్టుకు బ్యాంకు నుంచి రుణం పొందగలిగారు. ఏపీ రూరల్ రీస్ట్రచరింగ్ ప్రాజెక్టు పేరిట మొదలు పెట్టిన ఈ ప్రాజెక్టు కు ఏషియన్ బ్యాంక్ రుణం ఇవ్వటానికి ముందుకు వచ్చింది. దీంతో అధికారులు 55 ప్యాకేజీల కింద రెండు మూడు నియోజికవర్గాల రోడ్లను కలిపి టెండర్లకు పిలిచారు. టెండర్ లు దక్కించుకున్న కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం కూడా చేసుకుంది. కొందరు పనులు కూడా మొదలు పెట్టారు. అయితే పంచాయతీ రాజ్ శాఖలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ పై అవినీతి నీడలు కమ్ముకొంటున్నాయి.

టెండర్ లు అగ్రిమెంట్ పూర్తయిన పనులను నిలిపేసేందుకు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. వందల కోట్లకు సంభందించిన పనులు కావడంతో దీని పై పంచాయతీ రాజ్ శాఖలోని పెద్దలకు కన్నుపడింది. నిబంధనల ప్రకారం ఆ టెండర్లను రద్దు చేయటం సాధ్యం కాకపోవడంతో ఆ శాఖకు చెందిన ముఖ్య అధికారితో కొత్త పంచాయితీ మొదలుపెట్టారనే వాదన వినిపిస్తుంది.


తాము సూచించిన వారి పేరుతో ఎస్ యూ ఖాతా తెరవాలని ఓ ఉన్నతాధికారి ఒత్తడి తెస్తున్నట్లు సమాచారం. జిల్లాల్లో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ లు వెళ్లి జిల్లా మంత్రులను.. ముఖ్య నాయకులను.. కలుసుకుని తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఓ జిల్లా మంత్రి స్వయంగా దీని పై పంచాయతీ రాజ్ శాఖ పెద్దలతో మాట్లాడినట్లు తెలుస్తుంది. అయినప్పటికీ ఆ ఉన్నతాధికారి ఒత్తిళ్లు ఆగలేదని సమాచారం. ఒప్పందాలు జరిగిన సమయంలో తాము కొంత ఖర్చు పెట్టుకున్నామని.. ఇప్పుడు కొత్త గా ఇబ్బందులు సృష్టిస్తే పనులు చేయలేమంటూ కాంట్రాక్టర్ లు వాపోతున్నారు. వాస్తవంగా ఈ ప్రాజెక్ట్ అనుకున్నట్టుగా జరిగితే మండల.. నియోజకవర్గ స్థాయిలో అనూహ్య మార్పులు వస్తాయి. మౌలిక సదుపాయాలు పెరిగి  ఊర్ల రూపురేఖలు మారిపోతాయి.

అయితే స్వయంగా ఏషియన్ బ్యాంక్ నిధులు ఇచ్చిన ఇలాంటి ప్రాజెక్టుకు అవినీతి లెక్కలతో అడ్డు తగలడంపై పెద్ద చర్చే జరుగుతుంది. పనులు రద్దు అయితే ప్రాజెక్టుకు ఆర్థిక కష్టాలు తప్పవని ఆ శాఖాధికారులు చెబుతున్నారు. ఎలాగైనా ఈ సమస్య ను సీఎం దృష్టి కి తీసుకెళ్లి కొత్తగా మొదలైన అకౌంట్ వివాదానికి ముగింపు పలకాలని కాంట్రాక్టర్ లు భావిస్తున్నారు.