చిరంజీవిని సీఎం చేయడమే సోము వీర్రాజు లక్ష్యం 

అంతర్వేది రథం దగ్ధం ఘటనపై మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలన  వ్యాఖ్యలు చేశారు. అంతర్వేది ఆలయం రాజోలు నియోజకవర్గంలో ఉందని..  రాజోలులో జనసేన రెబల్ రాపాక వరప్రసాదరావు ఎమ్మెల్యేగా ఉండటం వల్లే జనసేన, బీజేపీలు అంతర్వేది ఘటనని రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ ద్వారా రాజోలు నియోజవర్గంలో కాపు కులాన్ని రెచ్చగొడుతున్నారని అన్నారు. 

 

బీజేపీ మతాభిమానంతో, జనసేన కులాభిమానంతో కుళ్లిపోయాయని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకి కులాభిమానం ఎక్కువని, చిరంజీవిని ముఖ్యమంత్రిని చేయాలనేది ఆయన లక్ష్యమని అన్నారు. చిరంజీవి కుటుంబానికి సోము వీర్రాజు హనుమంతుడిలా మారిపోయారని ఎద్దేవా చేశారు. కాగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఎంపికైన తరువాత సోము వీర్రాజు.. చిరంజీవిని ఇంటికి వెళ్లి కలిసిన సంగతి తెలిసిందే. దీనిని దృష్టిలో పెట్టుకునే హర్షకుమార్ ఈ వ్యాఖ్యలు చేసుంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 

సీఎం వైఎస్ జగన్ పై కూడా హర్షకుమార్ విమర్శలు గుప్పించారు. ఒక్కో కులానికి, ఒక్కో మతానికి ఒక్కోలా జగన్ నిర్ణయాలు తీసుకుంటారని విమర్శించారు. అంతర్వేది రథం ఘటనను సీబీఐకి అప్పగించాలని నిర్ణయించిన జగన్.. దళిత యువకుడికి శిరోముండనం కేసును సీబీఐ చేత ఎందుకు విచారణ చేయించడం లేదని ప్రశ్నించారు. దళితులపై సీఎం జగన్‌ కు చిత్తశుద్ధి ఉంటే.. శిరోముండనం ఘటనపై కూడా సీబీఐ విచారణ జరిపించాలని హర్షకుమార్ డిమాండ్ చేశారు.