హరీష్ రావు వర్గానికి టిక్కెట్లు లేవు..


 

వరంగల్ జిల్లాలో కొండా దంపతులకు మంచి పట్టుంది.సమైఖ్య రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన కొండా సురేఖ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికల్లో వరంగల్‌ తూర్పు నియోజకవర్గం నుంచి గెలుపొందారు. తదనంతర పరిస్థితుల దృష్ట్యా తెరాసలో చేరారు. ఇటీవల కేసీఆర్‌ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు వెళ్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆదేరోజు ఆయన 105 మంది పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటించారు. అయితే ఆ జాబితాలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే అయిన కొండా సురేఖ పేరు లేదు. దీంతో పార్టీ అధిష్ఠానంపై ఆగ్రహం వ్యక్తం చేసి రెండ్రోజుల్లో తనకు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్‌ చేశారు. మంత్రి హరీశ్‌రావుకు అనుకూలంగా ఉన్న నాయకులపై వ్యతిరేకత ఉందని ప్రచారం చేశారని, అక్కడ కేటీఆర్‌ అనుచరులకు టికెట్లు ఇచ్చారని కొండా సురేఖ ఆరోపించారు. టీఆర్‌ఎ్‌సలో తమది మంత్రి హరీశ్‌రావు వర్గమని, ఆయన వర్గంలో ఇంకా ఎందరున్నారో తర్వాత తెలుస్తుందన్నారు.

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవారికి నామినేటెడ్‌ పదవులు ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపించారు.దీంతో తాను, తన భర్త ఎమ్మెల్సీ కొండా మురళి తెరాసకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.అనంతరం కాంగ్రెస్‌ నేతలతో సంప్రదింపులు జరిపిన వారిద్దరూ నిన్న రాత్రే దిల్లీకి చేరుకున్నారు.ఈరోజు ఉదయం 11.30 గంటల సమయంలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. కొండా దంపతులు తమకు మూడు స్థానాలు కేటాయించాలని కోరుతున్నా.. మహాకూటమి సర్దుబాటు దృష్ట్యా అన్ని సీట్లు కేటాయించేందుకు కాంగ్రెస్‌ పార్టీ సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. కొండా సురేఖకు సీటు ఖాయమని పార్టీ హామీ ఇచ్చినట్లు సమాచారం. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఐదు స్థానాలను ప్రభావితం చేయగల కొండా దంపతులు తిరిగి సొంత గూటికి చేరడంతో కాంగ్రెస్‌ పార్టీలో ఉత్సాహం నెలకొంది.