యోగా గురువుకు మాయరోగం

 

ఈమధ్య గురువులకు మాయరోగాలు వచ్చి రకరకాల సెకలు పోయి దొరికిపోతున్నారు. ఇండియాలో వున్న చాలామంది గురువుల పరిస్థితి ఇలా వుందని బాధపడుతుంటే, ఇతర దేశాలలో వుండే గురువులకు కూడా ఇదే మాయరోగం పట్టుకుంది. ఆస్ట్రేలియాలోని మౌంట్ ఏలియా ప్రాంతానికి చెందిన రస్సెల్ క్రుక్‌మాన్ అనే ఒక 72 సంవత్సరాల వయసున్న ముసలాయన యోగా గురువు. ఆస్ట్రేలియావాసులకు ఎప్పటి నుంచో యోగాసనాలు నేర్పుతున్నాడు. స్వామి శంకరానంద అని పేరు మార్చుకున్న ఇతగాడు ఆస్ట్రేలియాలో తన పేరుతోనే ఒక యోగా కేంద్రాన్ని కూడా స్థాపించాడు. పళ్ళూడిపోయే వయసులో వున్న ముసలాయన కావడంతో ఈయన మీద ‘నమ్మకం’తో చాలామంది మహిళలు యోగా నేర్చుకోవాలని వచ్చేవారు. అయితే ఈ మధ్యకాలంలో ఒక బాంబులాంటి విషయం బయటపడింది. ఈ ముసలి యోగా గురు తన దగ్గరకి యోగా నేర్చుకోవడానికి వచ్చిన చాలామంది అమ్మాయిలను ముగ్గులోకి దించి వాళ్ళతో ‘భోగం’ అనుభవించేశాడట. ఈ విషయం బయటపడిపోవడంతో ఇక చేసేదేమీ లేక ఆయనగారే తాను చేసిన తప్పులని ఒప్పుకున్నాడు. తన దగ్గరకి వచ్చే మహిళలకు తాంత్రిక విద్యలు వస్తాయని నమ్మించి తనతో శారీరకంగా కలిసేలా ప్రేరేపించాలనని ఈ ముసలాయన వెల్లడించాడు. ఇప్పటి వరకు 40 మందికి పైగా యువతులు తన మాయలోపడిపోయారని చెప్పాడు. ఒక పవిత్రమైన స్థానంలో వుండి ఇలాంటి పని చేసినందుకు తనను క్షమించాలని వేడుకున్నాడు. ఆస్ట్రేలియా పోలీసులు ప్రస్తుతం ఈ ముసలాయన్ని ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారు.