పరాక్రమ దినోత్సవ వేడుకకు కేంద్రం భారీ ఏర్పాట్లు

 

పాకిస్తాన్‌ ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం నిర్వహించిన సర్జికల్ దాడులకు రెండేళ్లు పూర్తికావస్తున్న సందర్భంగా.. సర్జికల్ దాడుల వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు కేంద్రం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ‘పరాక్రమ దినోత్సవం’ పేరుతో ఈ నెల 28 నుంచి 30 వరకు వేడుకలు నిర్వహించనున్నారు. ఇదే పేరుతో ఓ దేశభక్తి గీతం కూడా సిద్ధమవుతోంది. ఈ నెల 28న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ రాజధానిలోని ఇండియా గేట్ వద్ద పరాక్రమ దినోత్సవ వేడుకలను ప్రారంభించనున్నారు. ఈ వేడుకల్లో భారత త్రివిధ దళాలైన ఆర్మీ, నేవీ, వైమానిక దళాలు పాల్గొననున్నాయి. కాగా దేశవ్యాప్తంగా సర్జికల్ దాడుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం ఇదే తొలిసారి. అన్ని రాష్ట్రాల్లోనూ ఈ వేడుకలు నిర్వహించాలని ఇప్పటికే కేంద్రం కోరిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పాలిత రాష్ట్రం పంజాబ్ సైతం ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముందుకు రావడం విశేషం.