గవర్నర్ వర్సెస్ భన్వర్ లాల్
posted on Mar 12, 2014 12:14PM
గవర్నర్ నరసింహన్ ఎంత చమత్కారంగా ఉంటారో అంతే సీరియస్ గా కూడా ఉంటారు. గతంలో డిసెంబర్ 31 తర్వాత ఏమవుతుంది అంటే, ఏముంది జనవరి 1 వస్తుంది అని సరదాగా నవ్వేశారాయన. అలాంటి గవర్నర్.. ఇప్పుడు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) భన్వర్ లాల్ మీద తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సమాచారం.
విషయం ఏమిటంటే, ప్రస్తుతం రాష్ట్రపతి పాలన ఉంది కాబట్టి, ప్రధాన అంశాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించాలని గవర్నర్ నరసింహన్ భావించారు. కానీ, ఆ విషయం సీఎస్ నుంచి భన్వర్ లాల్ వద్దకు వెళ్లింది. ఆయన కేంద్ర ఎన్నికల ప్రధానాధికారిని సంప్రదించి, ఇది ఎన్నికల కోడ్ కు ఉల్లంఘన అని, గవర్నర్ కూడా కోడ్ పరిధిలోకే వస్తారని చెప్పారు. దాంతో నరసింహన్ కు ఒళ్లు మండింది. అందుకే భన్వర్లాల్ కు ఘాటైన లేఖ రాస్తూ.. తన అధికారాల గురించి చెప్పనక్కర్లేదని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేస్తే చాలనే అర్థం వచ్చేలా పేర్కొన్నట్లు సమాచారం.