మణిపూర్ గవర్నర్ రాజీనామా

 

యుపిఎ హయాంలో గవర్నర్లుగా నియమితులైన వారు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే మహారాష్ట్ర గవర్నర్ నారాయణన్, కేరళ గవర్నర్ షీలా దీక్షిత్ రాజీనామా చేశారు. వారు తమ పదవులను పట్టుకునే వుండాలని ప్రయత్నించినా ఎన్డీయే ప్రభుత్వం చాలా పట్టుదలగా వ్యవహరించడంతో రాజీనామా చేయక తప్పలేదు. ఇదే కోటాలో తాజాగా మరో గవర్నర్ రాజీనామా చేశారు. ప్రస్తుతం మణిపూర్ గవర్నర్‌గా వున్న వి.కె.దుగ్గల్ తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ల రాజీనామాల పరంపరలో ఇది తొమ్మిదో రాజీనామా. వి.కె.దుగ్గల్ తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపించారు. వి.కె.దుగ్గల్ మణిపూర్ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేసి చాలా కొద్దికాలమే అయింది. పదవిలో కుదురుకోకముందే ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. కాగా, వి.కె.దుగ్గల్ గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశం మీద నియమించిన శ్రీకృష్ణ కమిటీలో కూడా సభ్యుడిగా పనిచేశారు.