అమీర్‌పేట - ఎల్బీనగర్‌ మెట్రో ప్రారంభం

 

అమీర్‌పేట - ఎల్బీనగర్‌ మెట్రో రైలు మార్గాన్ని సోమవారం తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కేటీఆర్‌, నాయిని నర్సింహారెడ్డి సహా పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. గవర్నర్‌ సహా ప్రముఖులందరూ అమీర్‌పేట నుంచి మెట్రోలో ఎల్బీనగర్‌కు పయనమయ్యారు. ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి ఈ మార్గంలో ప్రయాణికులను అనుమతించనున్నారు. అమీర్‌పేట నుండి ఎల్బీనగర్ కు సుమారు 16కి.మీ దూరం ఉంటుంది. ఈ దూరాన్ని కేవలం 50 నిమిషాల్లో ప్రయాణం చేయవచ్చు. బస్సుల్లో అయితే సుమారు గంటన్నరకు పైగా సమయం పట్టే అవకాశం ఉంటుంది. నేడు ప్రారంభమైన 16 కిలోమీటర్ల మెట్రోమార్గంతో కలిపి హైదరాబాద్‌ మెట్రో రైలు మార్గం పొడవు 46 కిలోమీటర్లకు చేరింది. దీంతో దేశంలో ఢిల్లీ మెట్రో తర్వాత ఎక్కువ దూరం మెట్రో రైలు మార్గం ఉన్న నగరంగా హైదరాబాద్‌ గుర్తింపు పొందింది.