పెళ్లిలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ బంగారు కడియంని కొట్టేశారు.. !

సహజంగా వేడుకల్లో కొంతమంది కేటుగాళ్లు తమ చేతి వాటాన్ని చూపుతుంటారు. తాజాగా ఓ వింత అనుభవం తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు ఎదురైంది. తాజాగా ఓ వివాహ మహోత్సవానికి వెళ్లిన శ్రీనివాస్ గౌడ్ చాలా ఉత్సాహంగా గడిపారు. అందరితో కలివిడిగా మాట్లాడుతూ వధూవరులనూ దీవిస్తూ అందరినీ పలకరిస్తూ అభిమానులతో ఫొటోలు దిగుతూ చాలా చురుగ్గా ఎంతో హుషారుగా కనిపించారు. అయితే పెళ్లికి వేల మంది రావడంతో అభిమానుల తాకిడి ఎక్కువైంది. కొందరు అభిమానులు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. ఈ సందట్లోనే దొంగలు తమ చేతివాటం చూపించారు. ఏకంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేతికున్న బంగారు కడియాన్ని లేపేశారు. అభిమానులతో హడావిడిగా గడిపిన మంత్రి తన చేతి కడియాన్ని దొంగలు కొట్టేయడాన్ని గమనించలేదు.

పెళ్లి.. వేడుక నుంచి బయటకు వచ్చిన తర్వాత తన చేతిని చూసుకున్న శ్రీనివాస్ గౌడ్ కడియం లేకపోవడంతో షాక్ తిన్నారు. తనకు ఎంతో కలిసొచ్చిన ఆ కడియం లేకపోవటంతో దిగాలు పడ్డారు. కొన్నేళ్లుగా ఆ కడియాన్ని ధరిస్తున్నానని ఎంతో కలిసొచ్చినట్లు ఆయన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆ కడియం దొరికిన వారెవరైనా తనకి తెచ్చి ఇస్తే లక్ష రూపాయల నజరానా ఇస్తానని ప్రకటించారు.

సెంట్ మెంట్ అలాంటిది మరి. ప్రతి ఒక్కరికీ సెంటిమెంట్స్ ఉంటాయి. కొన్ని వస్తువులు ఆభరణాలు కలిసొస్తుంటాయి. ఈ జాబితాలో వాహనాలూ, వాటి నెంబర్స్ కూడా ఉంటాయి. ఈ కలిసొచ్చిన వస్తువుల విలువ ఎంతైనా వాటికి విలువ కట్టలేం అంతే. కానీ వారి జీవితంలో ఆ వస్తువులు ఎంతో విలువైనవిగా భావిస్తూ ఉంటారు. ఆ లక్కీ వస్తువులు కనబడకపోయినా.. కోల్పోయిన ఆ బాధ వర్ణనాతీతం. మరి శ్రీనివాస్ గౌడ్ గారికి కూడా అలాంటి అనుభవమే ఎదురుకావడం షాక్ కు గురిచేసే విషయమే.