వైసీపీలోకి గోకరాజు కుటుంబం... రఘురామరాజుకు చెక్ పెట్టేందుకేనా?

ఏపీ బీజేపీకి భారీ షాక్ తగిలింది. సుదీర్ఘకాలంగా బీజేపీనే నమ్ముకుని, నిబద్ధతతో కాషాయ పార్టీలో కొనసాగుతోన్న మాజీ ఎంపీ గోకరాజు కుటుంబం వైసీపీ గూటికి చేరుతోంది. గోకరాజు సోదరులు నరసింహరాజు, రామరాజు, తనయుడు రంగరాజులు... ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకోనున్నారు. అయితే, 2019 ఎన్నికల సమయంలోనే గోకరాజు కుటుంబాన్ని వైసీపీకిలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరిగినట్లు తెలుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో నరసాపురం ఎంపీ టికెట్ ను గోకరాజు తనయుడు రంగరాజుకే మొదట వైసీపీ ఆఫర్ చేసిందని, కానీ ఆసక్తి చూపించకపోవడం... ఈలోగా రఘురామకృష్ణంరాజు టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరడంతో... సీన్ సడన్ గా మారిపోయింది.

రంగరాజు కోసం చేస్తున్న ప్రయత్నాలను విరమించుకుని రఘురామకృష్ణంరాజుకి వైసీపీ సీటు కేటాయించింది. అయితే, గెలిచిన తర్వాత రఘురామకృష్ణంరాజు వైఖరి తేడా ఉండటంతో...  అతనికి చెక్ పెట్టేందుకే మళ్లీ గోకరాజు కుటుంబాన్ని పార్టీలో చేర్చుకుంటున్నారనే టాక్ నడుస్తోంది. రఘురామకృష్ణంరాజు వ్యవహార శైలి వైసీపీ అధిష్టానానికి మింగుడుపడటం లేదని, సీఎం జగన్ పదేపదే హెచ్చరించినప్పటికీ గీత దాటుతున్నారని, అందుకే గోకరాజు కుటుంబాన్ని వ్యూహాత్మకంగా పార్టీలోకి తీసుకొస్తున్నారని అంటున్నారు. ముఖ్యంగా నరసాపురం పార్లమెంట్ స్థానం పరిధిలో రఘురామకృష్ణంరాజు ప్రాధాన్యతను తగ్గించి... ఆ స్థానంలో గోకరాజు కుటుంబాన్ని ప్రోత్సహించాలని భావిస్తున్నారట.

ఇదిలాఉంటే, గోకరాజు కుటుంబ నిర్ణయంతో బీజేపీ షాక్ కి గురైనట్లు తెలుస్తోంది. ఎందుకంటే, ఎంతోకాలంగా గోకరాజు కుటుంబం బీజేపీకి విధేయతతో పనిచేస్తోంది. బీజేపీలో క్రియాశీలకంగా వ్యవహరించడమే కాకుండా, జాతీయ నేతలతోను, అలాగే ఆర్ఎస్ఎస్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దాంతో, ఏపీలో మారిన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా కుటుంబ సభ్యులు పార్టీ మారినా, గోకరాజు మాత్రం బీజేపీలోనే ఉంటారని కాషాయ నేతలు అంటున్నారు.