గజ్వేల్ బరిలో గద్దర్.. కేసీఆర్ కి లాభమా? నష్టమా?

 

తెలంగాణలో డిసెంబర్ 7 న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఎన్నికలకు ఇంకా నెలరోజులు కూడా సమయం లేకపోవడంతో అన్ని పార్టీలు ఎన్నికల హడావుడిలో మునిగిపోయాయి. అయితే ఇప్పుడు అందరి దృష్టి ఒక నియోజకవర్గం మీద ఉంది. అదే గజ్వేల్ నియోజకవర్గం. 2014 లో కేసీఆర్ ఇక్కడి నుంచే పోటీచేసి గెలుపొందారు. ఇప్పుడు కూడా కేసీఆర్ గజ్వేల్ నుంచే బరిలోకి దిగనున్నారు. 2014 ఎన్నికల్లో కేసీఆర్.. టీడీపీ అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డి మీద సాధారణ మెజారిటీతోనే గెలిచారు. ప్రస్తుతం వంటేరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మహాకూటమి తరుపున మళ్ళీ ఆయనే బరిలోకి దిగనున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగితేనే వంటేరు, కేసీఆర్ కి గట్టిపోటీ ఇచ్చారు. అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్, టీడీపీ కలిసి పోటీ చేస్తుండడంతో ఈసారి నువ్వా నేనా అన్నట్టు పోటీ సాగే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే ఇప్పుడు గజ్వేల్ పోరులోకి ప్రజా గాయకుడు గద్దర్ కూడా ఎంట్రీ ఇచ్చారు.

నిజానికి గద్దర్.. కేసీఆర్ మీద పోటీ చేస్తానని ఇంతకుముందే సంకేతాలు ఇచ్చారు. అదీగాక గద్దర్ ఆ మధ్య ఢిల్లీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో సమావేశం కూడా అయ్యారు. దీంతో గద్దర్ మహాకూటమి తరుపున బరిలోకి దిగుతారని అనుకున్నారంతా. అయితే తాజాగా గద్దర్ ఆ ఊహలు అన్నింటికీ బ్రేకులేశారు. తాను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కానని.. గజ్వేల్ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అయితే గజ్వేల్ నుంచి గద్దర్ బరిలోకి దిగితే కేసీఆర్ కి లాభం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గద్దర్ పోటీ వల్ల కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలే అవకాశముందని విశ్లేషకులు భావిస్తోన్నారు. చూద్దాం మరి గద్దర్ ఏం చేస్తారో. మహాకూటమికి షాక్ ఇస్తారో లేక కేసీఆర్ కి షాక్ ఇస్తారో. లేదా అనూహ్యంగా ఇద్దరికీ షాక్ ఇస్తారో.