మారని మృగాళ్ల తీరు.. మరో యువతిపై దాడి చేసిన పోకిరీలు

 

హైదరాబాద్ వెటర్నరీ డాక్టర్.దిశా దారుణ హత్యల పై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. అమ్మాయిల పై దాడులు ఏ మాత్రం ఆగడం లేదు. శ్రీకాకుళం జిల్లా రాజాంలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని పై నలుగురు పోకిరీలు లైంగిక దాడికి ప్రయత్నించారు. నిన్న ( డిసెంబర్ 1వ తేదీ ) రాత్రి 9 గంటల సమయంలో విద్యార్థిని తన స్నేహితురాళ్లతో కలిసి భోజనం కోసం బయటకు వచ్చిన సమయంలో నలుగురు పోకిరీలు ఆమె చేయి పట్టుకుని లాగారు. అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించడంతో ఆ విద్యార్థిని ప్రతిఘటించింది. దీంతో రెచ్చిపోయిన పోకిరీలు ఆ అమ్మాయిని తీవ్రంగా కొట్టారు. ఇక యువకుల దాడితో బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు స్పందించారు. వెంటనే నిందితుల్ని అడ్డుకొని పోలీసులకు సమాచారమిచ్చారు. నిందితులని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బాధితురాలిని రాజాం ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మరోవైపు నిందితుల వివరాలు చెప్పకుండా పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. భాదితురాలు ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం చదువుతున్నట్లుగా తెలిపారు. రాత్రి టిఫిన్ కోసమని తోటి స్నేహితురాళ్లతో కలిసి రోడ్డు మీదకు వచ్చిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని బాధితురాలు వెల్లడించింది. ప్రియాంక రెడ్డికి సంబంధించిన హత్య ఘటన మరవకముందే వరుసగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉంటున్నాయి.