రామేశ్వరంలోనే కలాం అంత్యక్రియలకి కేంద్రం ఏర్పాట్లు

 

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కుటుంబ సభ్యుల విజ్ఞాప్తి మేరకు ఆయన అంత్యక్రియలను ఆయన స్వస్థలమయిన రామేశ్వరంలోనే నిర్వహించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. ఈరోజు సాయంత్రం వరకు ప్రజల సందర్శనార్ధం ఆయన భౌతిక కాయాన్ని డిల్లీలోని 10, రాజాజీ మార్గ్ లోగల ఆయన అధికారిక నివాసంలో ఉంచుతారు. ఈరోజు రాత్రికి లేదా రేపు ఉదయం ఆయన భౌతిక కాయాన్ని రామేశ్వరం తరలించేందుకు కేంద్రప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అన్ని అధికారిక లాంఛనాలతో రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఆ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీతో సహా కొందరు కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, గవర్నర్లు కూడా హాజరవుతారు.