బాహుబలి సెట్‌లో అగ్ని ప్రమాదం...

 

ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘బాహుబలి’ చిత్రం షూటింగ్‌లో ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. శనివారం సాయంత్రం ఫైట్ సన్నివేశాల షూటింగ్ చేస్తూ వుండగా అకస్మాత్తుగా పేలుడు సంభవించి నలుగురు ఫైటర్లకు మంటలు అంటుకున్నాయి. భారీ మొత్తంలో కుంకుమ వెదజల్లేందుకు పేలుడు పదార్థాలను ఉపయోగించారు. దీంతో మంటలు  భారీగా ఎగసిపడ్డాయి. ఆ మంటలు షూటింగ్‌లో పాల్గొనేందుకు వచ్చి పక్కనే నిలుచుని వున్న నలుగురు ఫైటర్లకు అతి సమీపంగా ఎగసిపడ్డాయి. దీంతో నలుగురు ఫైటర్లు సతీష్, పాండు, గణేష్, సంతోష్‌లకు కాలిన గాయాలయ్యాయి.