ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం..ముగ్గురు సజీవదహనం

దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈశాన్య ఢిల్లీలోని మోహన్ పార్క్ ప్రాంతంలోని ఓ భవనంలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. పార్కింగ్ ప్రదేశం నుంచి వచ్చిన మంటలు క్రమంగా అపార్ట్‌మెంట్ మొత్తం వ్యాపించాయి. ఈ ఘటనలో ముగ్గురు సజీవ దహనమవ్వగా..మరో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. పార్క్ చేసిన ఆటో రిక్షా నుంచి షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం సంభవించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.