5వ తేదీకి రైతు రుణమాఫీ జాబితాలు...

 

అర్హులైన రైతులకు వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానని తాను చేసిన హామీని నిలుపుకునే దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. నవంబర్ 5వ తేదీ నాటికి రాష్ట్రంలోని బ్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ రుణమాఫీ అర్హుల జాబితాలను ఉంచుతారు. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు వెల్లడించారు. బ్యాంకుల్లో రుణమాఫీ అర్హుల జాబితాతోపాటు అనర్హుల జాబితా కూడా వుంటుందని ఆయన చెప్పారు. కొంతమంది రైతులు రుణమాఫీకి ఎందుకు అనర్హులన్న విషయాన్ని బ్యాంకులు వెల్లడిస్తారని ఆయన చెప్పారు. ఈ జాబితాలు ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో వుంటాయని, నవంబర్ 12వ తేదీ నాటికి రైతు ఖాతాల్లో నగదు జమ అవుతుందని కుటుంబరావు తెలిపారు.