అన్నదాతలు బాగుంటే అందరూ బాగున్నట్లే

 

అన్నదాతలను ప్రభుత్వాలు ఆదుకోవడం అభినందనీయమే. కానీ వారు దశాబ్దాలుగా ఈ అప్పుల చక్రంలో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ, వారిని దాని నుండి బయటపడేసేందుకు ఏ ప్రభుత్వమూ సరయిన ప్రణాళిక రచించలేదు. అసలు దేశప్రజలకు అన్నం పెట్టేందుకు అప్పులు చేయవలసిరావడాన్ని ఏ ప్రభుత్వాలు కూడా తమకు అవమానకరంగా భావించకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. రైతులు అప్పులు చేస్తుంటే వాటిని మాఫీ చేయడంకంటే, వారికి ఆ పరిస్తితి రాకుండా వారికి ఇన్ పుట్ సబ్సీడీలు, మార్కెట్ ధరల స్థిరీకరణ, మార్కెట్ యార్డుల ఏర్పాటు, పంటలను నిలవ చేసేందుకు గోదాముల ఏర్పాటు, ఎరువులు, పురుగుల మందులు, వ్యవసాయ పనిముట్లు, నీళ్ళు వంటివి సకాలంలో అందించగలిగితే, ఈ సమస్య నుండి బయటపడవచ్చును.  అందువల్ల ఇప్పటికయినా ప్రభుత్వాలు మేల్కొని వారికి అటువంటి పరిస్థితి ఏర్పడకుండా ఉండేందుకు తగిన చర్యలు చేపట్టినట్లయితే, రైతన్నలే రాష్ట్రాన్ని ఆర్ధిక సమస్యల నుండి గట్టెకించగలరు.