ముగ్గురు అమ్మాయిలతో...

 

ఉద్యోగాలు చేసో, ఏదైనా వ్యాపారం చేసో ఎంత డబ్బు సంపాదిస్తాం.. కొడితే జాక్‌పాట్ కొట్టాలి.. ఏదోరకంగా డబ్బు సంపాదించాలి. ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదు.. ఎలా సంపాదించామన్నదే ముఖ్యమని ఆలోచించేవాళ్ళు ఈరోజుల్లో చాలామంది వున్నారు. హైదరాబాద్‌లో టైలరింగ్ షాపు నిర్వహించే లక్ష్మీనారాయణ కూడా సేమ్ ఇలాగే ఆలోచించాడు. ఎంతకాలం ఇలా కుట్లు కుట్టుకుంటూ బతకాలని అనుకున్నాడు. బాగా డబ్బులు మిగిలే వ్యాపారం మొదలుపెట్టాడు. సరిత, హారిక, అనిత అనే ముగ్గురు అందమైన అమ్మాయిల్ని అపాయింట్ చేసుకున్నాడు. ఆ అమ్మాయిలు ఎలా వున్నారంటే, వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళారంటే మగజీవులు వాళ్ళ ముఖాలు చూసి మైమరచిపోయేలా వున్నారు. ఈ ముగ్గురు అమ్మాయిలకీ లక్ష్మీనారాయణ ప్రతిరోజూ కొన్ని వేల దొంగనోట్లు ఇచ్చేవాడు. ఆ ముగ్గురు అమ్మాయిలూ చక్కగా సిటీలో తిరుగుతూ ప్రతిరోజూ తమకు ఇచ్చిన వేలాది దొంగనోట్లని షాపుల్లో చలామణి చేసేవారు. చాలాకాలంగా కొన్ని వందల షాపుల్లో వీళ్ళు ముగ్గురూ లక్షల రూపాయల దొంగనోట్లను చెలామణి చేశారు. పాపం ఆ షాపుల్లో వున్న మగజీవులు వీళ్ళనని చూస్తారా, వాళ్ళిచ్చే నోట్లని చూస్తారా... అలా బుట్టలో పడిపోయారు. ఈ నోట్లని చెలామణి చేసినందుకు ఈ ముగ్గురమ్మాయిలకు కూడా బాగానే గిట్టుబాటు అయ్యేది. ఇలా చాలాకాలం వీళ్ళ హవా నడిచింది. కానీ లేటెస్ట్‌గా వీళ్ళు పోలీసులకు దొరికిపోయారు. సూత్రధారితోపాటు పాత్రధారులు కూడా ప్రస్తుతం జైల్లో వున్నారు.